నవతెలంగాణ-హైదరాబాద్ : ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 90,692 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో 1,12,976 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 26,744 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20 వేల క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,917 క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.10 అడుగుల వద్ద ఉన్నది. అదేవిధంగా ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 215.80 టీఎంసీలకు గాను ఇప్పుడు 199.27 టీఎంసీలు ఉన్నాయి.
కాగా, శనివారం రాత్రి భారీగా వరద ఉండటంతో అధికారులు రెండు గేట్లు ఎత్తివేశారు. అయితే ఆదివారం ఉదయానికి ప్రవాహం తగ్గడంతో ఒక గేటును మూసివేశారు. దీంతో ప్రస్తుతం ఒక గేటు గుండా 26,744 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. ఈ నెల 8న శ్రీశైలం డ్యామ్ గేట్లను మొదటిసారి ఎత్తిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు (6, 7, 8, 11) గేట్లను నీటిని విడుదల చేశారు. అనంతరం వరద తగ్గుముఖం పట్టడంతో గేట్లను మూసివేశారు.