నవతెలంగాణ వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుశాయి. ములుగు జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. జయశంకర్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి.
భారీ వర్షాలకు ములుగు జిల్లాలో బొగత వాటర్ ఫాల్స్ వద్ద భారీగా వరద పెరిగింది. తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాజేడు మండలం వద్ద ఉధృతంగా బొగత జలపాతం వరద పరవళ్లు తొక్కుతున్నది.
దాంతో అధికారులు అప్రమత్తమై వాటర్ ఫాల్స్ వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పర్యాటకులను అనుమతించడం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో ములుగు జిల్లాలో భారీగా వర్షపాతం నమోదైంది. వెంకటాపురంలో అత్యధికంగా 25 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది.
అలాగే, ఏటూరునాగారంలో 18.4, మంగపేటలో 15.8, అలుబాక(జెడ్)లో 14.9, గోవిందరావుపేటలో 12.3, వెంకటాపూర్లో 8.9, లక్ష్మీదేవిపేటలో 9.3, వాజేడులో 7.2, ములుగు మండలం మల్లంపల్లిలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యిందని వాతావరణశాఖ తెలిపింది.