నవతెలంగాణ-హైదరాబాద్: పుతిన్ పర్యటన నేపథ్యంలో రెండు రోజుల పాటూ ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత కొనసాగనుంది. రాజధాని చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేశారు. పుతిన్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని నగరమంతా హై-అలర్ట్లో ఉంచారు. స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (స్వాట్) బృందాలు, ఉగ్రవాద నిరోధక విభాగాలు, స్నిపర్లు, త్వరిత-ప్రతిచర్య బృందాలతో కూడిన బహుళ స్థాయి భద్రతా గ్రిడ్ ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 మందికిపైగా పోలీసు సిబ్బందిని నగరంలో మోహరించారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం భారత్కు చేరుకోనున్నారు. పర్యటన సందర్భంగా వాణిజ్య, ఆరోగ్య, వ్యవసాయ, మీడియా, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాలలో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం 25వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య 23వ ద్వైపాక్షిక సదస్సు జరగనుండడం విశేషం.
పుతిన్ ప్రయాణించే విమానానికి రక్షణగా ఒకటి లేదా 2 విమానాలు వెన్నంటి ఉంటాయి. అధ్యక్షుడు ప్రయాణించే విమానం అత్యంత అధునాతనంగా ఉంటుంది. అత్యంత అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థ అందులో ఉంటుంది. క్షిపణి దాడులను తట్టుకునే రక్షణ వ్యవస్థ ఈ విమానం ప్రత్యేకత. అంతేగాక ఈ విమానంలో అణ్వస్త్ర కమాండ్ కంట్రోల్ బటన్ కూడా ఉంటుంది. గగనంలోనుంచే అధ్యక్షుడు అణ్వస్ర్తాల ప్రయోగానికి ఆదేశించవచ్చు. విమానంలో అనేక సమావేశ గదులు, కాన్ఫరెన్స్ రూము, బెడ్రూము, బార్, జిమ్, మెడికల్ రూము ఉంటాయి. విమానం లోపలి భాగం బంగారు తాపడం కలిగి ఉంటుంది. ఏకకాలంలో 262 మంది ఇందులో ప్రయాణించవచ్చు. ఏకబిగిన 11,000 కిలోమీటర్లు ఇది ప్రయాణించగలదు.


