Tuesday, June 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహైకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌ కిడ్నాప్‌

హైకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌ కిడ్నాప్‌

- Advertisement -

భూమి విషయంలో లాయర్‌ కోటి రూపాయలు అగ్రిమెంట్‌
తిరిగి ఇవ్వడం లేదని ప్రకాశం జిల్లాకు తీసుకెళ్లి బెదిరింపులు
సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకున్న పోలీసులు
పోలీసుల అదుపులో ఇద్దరు కిడ్నాపర్లు
అలాంటి ఒప్పందమే లేదంటున్న అడ్వకేట్‌ భార్య
నవతెలంగాణ-వనస్థలిపురం

ఓ భూమి వివాదంలో అడ్వకేట్‌ కోటి రూపాయలు అగ్రిమెంట్‌ చేసుకుని ఏ విషయం తేల్చకపోవటంతో డబ్బులు ఇచ్చినవారు అడ్వకేట్‌ను కిడ్నాప్‌ చేసిన సంఘటన హైదరాబాద్‌ వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థలిపురం ఏసీపీ పల్లె కాశిరెడ్డి, వనస్థలిపురం సీఐ మహేష్‌ గౌడ్‌, ఎస్సై గిరీష్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం సరస్వతినగర్‌ ఎస్‌ఎన్‌ఆర్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న హైకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌ పాలడుగు నారాయణ 2020లో మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌లోని పది ఎకరాలు భూమి విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించి వెంకటేశ్వర్లుతో పాటు మరో ముగ్గురి వద్ద కోటి రూపాయలు తీసుకుని అగ్రిమెంట్‌ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు అగ్రిమెంట్‌ చేసుకున్న వారు ఆ భూమిని చూడలేదు. అగ్రిమెంట్‌ చేసుకున్న వారిలో వెంకటేశ్వర్లుకు నారాయణ మేనమామ. వెంకటేశ్వర్లు ఆర్మీలో ఉద్యోగం చేసి రిటైర్‌ కాగా వచ్చిన రూ. 35 లక్షలను తన పిల్లల భవిష్యత్తు గురించి నారాయణకు ల్యాండ్‌ నిమిత్తం ఇచ్చాడు. ఇన్నేండ్లయినా ల్యాండ్‌ చూపించకపోవడంతో వెంకటేశ్వర్లు నారాయణ్‌ను పలుసార్లు ప్రశ్నించాడు. లాభం లేకపోవడంతో ఈనెల 7న ఆఫీస్‌కు వెళ్తున్న నారాయణను కారులో వెంకటేశ్వర్లు ఎక్కించుకుని ఇద్దరికీ సంబంధించిన ఒకటే ఊరు ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్ర కొండ పాలెం మండలం పెద్ద గుడి పాలెం గ్రామానికి తీసుకువెళ్లాడు. నారాయణ భార్య సుగుణమ్మ తన భర్త ఇంటికి తిరిగి రాకపోవడంతో ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. మరుసటి రోజు ఉదయం తన భర్త ఫోన్‌ నుంచి వెంకటేశ్వర్లు ఫోన్‌ చేసి తనకు ఇవ్వాల్సిన రూ.35 లక్షలు ఇవ్వకపోతే నీ భర్తని చంపేస్తానని బెదిరించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో బండి నెంబర్‌, ఫోన్‌ నెంబర్లు ద్వారా వారు ఎక్కడున్నది కనుక్కున్నారు. వెంకటేశ్వర్లు, అతని చెల్లి సరస్వతిలను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం ఐదు గంటలకు వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లో హాజరు పరిచారు. నిందితున్ని రిమాండ్‌ తరలించామని, ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలియజేశారు.
ఇదిలా ఉండగా నిందితుడు వెంకటేశ్వర్లు భార్య పోలీస్‌స్టేషన్‌ ముందు మీడియాతో మాట్లాడారు. తాము రూ. 35 లక్షలు భూమి విషయంలో నారాయణకి ఇచ్చామని, అయితే ఆ డబ్బులను ఆయన అమెరికాలో తన కూతురు చదువు నిమిత్తం ఖర్చు చేసినట్టు ఆయనే చెప్పినట్టు తెలిపారు. నిలదీసి డబ్బులు అడిగితే కోర్టులో చూసుకోండని మానసికంగా వేధింపులకు గురి చేశాడని చెప్పారు. ఈ విషయంపై 2023 సంవత్సరంలో వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సివిల్‌ కేసు కోర్టులో చూసుకోవాలని ఫిర్యాదు తీసుకోలేదని ఆవేదనకు గురైంది. 10 ఎకరాల భూమి కుత్బుల్లాపూర్‌లో అసలు లేదని, మోసం చేశాడని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -