నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి చీనాబ్ వంతెనను ఈనెల 6న పీఎం మోడీ ప్రారంభిస్తారని..సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి జితేంద్రర్ సింగ్ తెలిపారు. ఈ వంతెన జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL) ప్రాజెక్టులో భాగంగా జమ్మూకశ్మీర్లో నిర్మించారు. ఈ కాట్రా-టు-సంగల్దాన్ స్ట్రెచ్లో భాగంగా ఉంటుంది. ఇది న్యూఢిల్లీని నేరుగా కాశ్మీర్తో కాట్రా ద్వారా కలుపుతుంది.
జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో ఉన్న చీనాబ్ వంతెన నదీగర్భం నుండి 359 మీటర్ల ఎత్తులో ఉన్న ఇంజనీరింగ్ అద్భుతమన్నారు. ఇది చరిత్రలో మొదటిసారిగా అధికారికంగా కాశ్మీర్ లోయను రైలు ద్వారా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుందన్నారు. అలాగే ఈ ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) పొడవు దాదాపు 272 కిలోమీటర్లు. ఈ 272 కిలోమీటర్లలో, దాదాపు 119 కిలోమీటర్ల పొడవుతో దాదాపు 36 సొరంగాలు నిర్మించబడ్డాయని, ఈ ప్రాజెక్టులో దాదాపు 1,000 వంతెనలు ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. ఇది న్యూ ఇండియా స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తుందని, ఇంజనీర్లు ప్రతిభ అద్భుతమని కేంద్రమంత్రి కొనియాడారు.