– ట్రాన్స్జెండర్ పీపుల్స్ అసోసియేషన్, టీపీఎస్కే నాయకులు : థర్డ్ జెండర్ జడ్జిమెంట్ అమలు చేయాలని డిమాండ్
నవతెలంగాణ-ముషీరాబాద్
శుభకార్యాలలో హిజ్రాలు అసభ్యకర ప్రవర్తన మానుకోవాలని ట్రాన్స్జెండర్ పీపుల్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం నాయకులు సూచించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం టీపీఎస్కే హాల్లో ట్రాన్స్జెండర్స్ పీపుల్స్ అసోసియేషన్ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ట్రాన్స్జెండర్ హక్కుల యాక్టివిస్ట్ రచన ముద్రబోయిన మాట్లాడుతూ.. పెరుగుతున్న హిజ్రా జనాభాకు తగినన్ని కనీస వసతులు తెలంగాణ ప్రభుత్వం నేటికీ కల్పించలేదని తెలిపారు. ఇండ్లు లేవు, ఉపాధి లేదు, హిజ్రాలంటే? అడుక్కోవడం, వ్యభిచారం చేయడమేనా? మనుషుల్లా మమ్మల్ని గుర్తించండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రోటి, కపడా, మకాన్ సమకూర్చటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. హిజ్రాల సముదాయం కనీస అవసరాల సాధనలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, గౌరవంగా, ఆత్మాభిమానంగా ఉండాలని సూచించారు. శుభకార్యాలలో అసభ్యకరంగా ప్రవర్తించొద్దని హిజ్రా గురువుల సమక్షంలో నిర్ణయం తీసుకున్నారు. హిజ్రా సంస్కృతి దిగజారకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. నగ సంస్కృతిని పూర్తిగా నిషేధించాలని, మనం గౌరవంగా ఉంటూ ప్రజలకు గౌరవాన్ని ఇవ్వాలని, ప్రజలకు ఎప్పుడూ జవాబుదారీగా ఉండాలని చెప్పారు. అప్పుడు మాత్రమే ప్రజలు తమను గౌరవిస్తారన్నారు. తెలంగాణ ట్రాన్స్జెండర్ అండ్ హిజ్రా అసోసియేషన్ నాయకులు మోనాలిసా మాట్లాడుతూ.. రాష్ట్రం అవతరించి 11 సంవత్సరాలైనా.. ఇద్దరు ముఖ్యమంత్రులు మారినా ట్రాన్స్జెండర్స్ సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టు వెలువరించిన థర్డ్ జండర్ జడ్జిమెంట్ రాష్ట్రంలో అమలు చేయాలని కోరామని, తెలంగాణ హైకోర్టును కూడా సంప్రదించామని కానీ అమలుకు నోచుకోలేదన్నారు. టీపీఎస్కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అమలులో జాప్యం జరుగుతోందన్నారు. అమలుకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, పోలీస్ డిపార్ట్మెంట్లో, షీ టీంలో ఫ్రైడ్ ప్లస్ ట్రాన్స్జెండర్ వారికి ప్రత్యేక లీగల్ క్లినిక్ ఏర్పాటు చేయాలని, మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హిజ్రా అండ్ ట్రాన్స్జెండర్ అసోసియేషన్ నాయకులు ఆర్.జస్మిన్ జి.గంగ, సోనీ అనిత తదితరులు పాల్గొన్నారు.
హిజ్రాలు అసభ్యకర ప్రవర్తన మానుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES