నవతెలంగాణ – డిచ్ పల్లి
గల్ఫ్ కార్మికులకు, ఎన్నారైలకు కష్టమొస్తే… ఇక్కడ హైదరాబాద్ లో ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రవాసీ ప్రజావాణిలో చెప్పుకోవచ్చని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఎన్నారై అడ్వయిజరీ కమిటీ గౌరవ సభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్టంలో లేని విధంగా తెలంగాణాలో ప్రవాసీ ప్రజావాణిని ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి, కాంగ్రేస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన అన్నారు.
హైదరాబాద్ బేగంపేట ప్రజా భవన్ లో శుక్రవారం జరిగిన ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొని గల్ఫ్, యూకే, ఆస్ట్రేలియా ప్రవాసీ కుటుంబాలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్. జి. చిన్నారెడ్డి తో సమావేశమై పలు విషయాలు చర్చించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీం రెడ్డి, మెంబర్లు నంగి దేవేందర్ రెడ్డి, సిస్టర్ లిజీ జోసెఫ్, ఎన్నారైలు రంగుల సుధాకర్ గౌడ్ (యూకే,), అమరేందర్ బొజ్జ (అమెరికా), గుండేటి గణేష్, శ్రీ నూనె లక్ష్మణ్ యాదవ్ (ఓమాన్), వలస కార్మిక హక్కుల నాయకులు బి. ఎల్. సురేంద్రనాథ్, భార్గవి తదితరులు పాల్గొన్నారు.