– అంచనాలలో తేడాలతో గందరగోళం
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత పేదరికంతో బాధపడుతున్న వారి సంఖ్య బాగా తగ్గిపోయిందని ప్రపంచబ్యాంక్ ఇటీవల అంచనా వేసిన విషయం తెలిసిందే. బ్యాంక్ అంచనా ప్రకారం దేశంలో 2011-12లో 34.4 కోట్ల మంది నిరుపేదలు ఉండగా 2022-23 నాటికి వారి సంఖ్య 7.5 కోట్లకు తగ్గింది. అంటే 11 సంవత్సరాల వ్యవధిలో 26.9 కోట్ల మంది అత్యంత దారిద్య్ర పరిస్థితి నుండి బయటపడ్డారన్న మాట. 2021లో తాజా పరచిన నిర్వచనం ప్రకారం రోజుకు మూడు డాలర్లు, అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన వారిని అత్యంత నిరుపేదలుగా పరిగణిస్తారు. ఈ స్వల్ప ఆదాయంతో ఆహారం, తాగునీరు, ఆవాసం, ప్రాథమిక ఆరోగ్య రక్షణ వంటి మౌలిక అవసరాలు తీర్చుకోవడం కష్టమని ప్రపంచబ్యాంక్ చెబుతోంది. ఈ లెక్కన దేశ జనాభాలో 5.3 శాతం మంది అత్యంత నిరుపేదలేనని అర్థమవుతోంది.
అయితే మన దేశంలో జనగణన చివరిసారిగా 2011లో జరిగింది. కాబట్టి ఇప్పుడు జనాభాలో నిరుపేదలు ఏ మేరకు ఉన్నారో చెప్పడం కష్టం. కానీ ఈ విషయంలో కొన్ని హేతుబద్ధమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచంలో 83.8 కోట్ల మంది నిరుపేదలు ఉన్నారని ఓ అంచనా. వీరిలో 7.7 కోట్ల మంది మన దేశంలోనే ఉన్నారని ప్రపంచబ్యాంక్ అంటోంది. అంటే ప్రపంచ నిరుపేదలలో 9 శాతం మంది మన దేశంలోనే ఉన్నారన్న మాట. ఇది ప్రపంచ సగటు కంటే ఎక్కువే. సంఖ్యాపరంగా చూస్తే నైజీరియా తర్వాత మన దేశంలోనే అత్యంత నిరుపేదలు ఉన్నారు.
యూఎన్డీపీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కలిసి బహుమితీయ పేదరిక సూచీ (ఎంపీఐ)ని అభివృద్ధి చేశాయి. సూచీ రూపకల్పనలో ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలకు సంబంధించిన పది కొలమానాలను ఉపయోగించారు. వీటిలో శిశు మరణాలు, వంటకు ఉపయోగిస్తున్న ఇంధనం, పారిశుధ్యం, తాగునీరు వంటి ప్రత్యేక సూచికలు కూడా ఉన్నాయి. నీతి ఆయోగ్ వీటితో పాటు మరో రెండు సూచికలను…తల్లుల ఆరోగ్యం, బ్యాంక్ ఖాతా…కలిపి మొత్తం 12 సూచికలను ఉపయోగించి ఎంపీఐని లెక్కిస్తోంది. నీతి ఆయోగ్ పరిశోధన ప్రకారం 2013-14లో భారత ఎంపీఐ 29 శాతం ఉండగా 2022-23 నాటికి 11.3 శాతానికి తగ్గిపోయింది. ఓ విశ్లేషణ ప్రకారం సుమారు 24.8 కోట్ల మంది ప్రజలు ఎంపీఐ పేదరికం నుండి బయటపడ్డారు. పది కొలమానాలతో యూఎన్డీపీ రూపొందించిన ఎంపీఐ ప్రకారం 2019-21లో మన ఎంపీఐ పేదరిక రేటు 15 శాతంగా ఉంది. అంటే నీతి ఆయోగ్ చెప్పిన దాని కంటే నాలుగు శాతం ఎక్కువన్న మాట. యూఎన్డీపీ హెడ్కౌంట్ దామాషా ప్రకారం మన ప్రపంచ ర్యాంక్ 109 దేశాలలో 66గా ఉంది. అత్యంత నిరుపేదలపై ప్రపంచబ్యాంక్ విడుదల చేసిన తాజా డేటాలో ప్రపంచ ర్యాంక్ లేదు.
2015లో ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రకటించింది. ఇందులో మొదటి లక్ష్యం ఏమిటంటే 2030 నాటికి నిరుపేదలు అనే వారు లేకుండా చేయడం. ఈ లక్ష్య సాధనకు మరో ఐదు సంవత్సరాల సమయం మాత్రమే మిగిలి ఉంది. కానీ పేదరిక అంచనాలలో తేడాలు కన్పిస్తున్నాయి. కొలమానాలు, సూచికలలో వ్యత్యాసాలు ఉన్నాయి. వీటిలో వేటిని పరిగణనలోకి తీసుకోవాలి? ఈ గందరగోళం నేపథ్యంలో ఐరాస నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించగలమా అన్న సందేహం వ్యక్తమవుతోంది.
దేశంలో నిరుపేదలు ఎందరు?
- Advertisement -
- Advertisement -