– టెక్ సీఈఓలను ప్రశ్నించిన ట్రంప్
– శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడి విందు
– హాజరైన పలువురు టెక్ దిగ్గజాలు
– టెస్లా అధినేత ఎలన్ మస్క్కు అందని ఆహ్వానం?
వాషింగ్టన్ : అమెరికాలో పెట్టుబడులే లక్ష్యంగా పలువురు టెక్ దిగ్గజాలకు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విందు ఇచ్చారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌజ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధిపతులు, సీఈఓలు హాజరయ్యారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన ఏఐ ఈవెంట్ అనంతరం ఈ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టిమ్కుక్, సుందర్ పిచారు, మార్క్ జుకర్బర్గ్, సత్యనాదెళ్ల వంటి పలువురు టెక్ దిగ్గజాలు హాజరయ్యారు. అయితే ట్రంప్ ఒకప్పటి మిత్రుడు, టెస్లా అధినేతకు మాత్రం ఆహ్వానం అందకపోవటం గమనార్హం. తనకు ఆహ్వానం అందిందనీ, తాను మాత్రం ఈ విందుకు హాజరు కాలేకపోయానని మస్క్ వివరణ ఇచ్చారు. అమెరికాలో టెక్ కంపెనీల పెట్టుబడుల గురించి వాటి అధిపతులు, సీఈఓలను ట్రంప్ ప్రశ్నించారు. ఎవరు ఎంత పెట్టుబడులుప పెట్టనున్నారో ఆరా తీశారు.
ట్రంప్ ప్రశ్నలకు పలువురు టెక్ సీఈఓలు బదులిచ్చారు. ”టిమ్.. అమెరికాలో యాపిల్ ఎంత పెట్టుబడులు పెట్టనుంది. అది చాలా పెద్ద మొత్తమే అయి ఉంటుందని నాకు తెలుసు. ఇన్నాళ్లూ మీరు బయట (ఇతర దేశాల్లో) పెట్టుబడులు పెట్టింది చాలు. ఇక స్వదేశానికి తిరిగిరండి. ఎంత పెట్టుబడి పెడతారు?” అని యాపిల్ సీఈవో టిమ్ కుక్ను ట్రంప్ అడిగారు. దీనికి టిమ్ బదులిస్తూ.. ‘600 బిలియన్ డాలర్లు’ అని చెప్పారు. భారత్లో యాపిల్ కార్యకలాపాలు నిలిపివేయాలంటూ గత కొంత కాలంగా ఆ సంస్థపై ట్రంప్ ఒత్తిడి చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే భారత్ను టార్గెట్గా చేసుకొనే విదేశాల్లో పెట్టుబడులు ఆపేయాలని ట్రంప్.. టిమ్ను ప్రశ్నించినట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ట్రంప్ అడిగిన ఇదే ప్రశ్నకు మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ బదులిస్తూ.. ‘600 బిలియన్ డాలర్లు’ ఇన్వెస్ట్ చేయనున్నట్టు చెప్పారు. రాబోయే రెండేండ్లలో 250 బిలియన్ డాలర్లు అమెరికాలో పెట్టుబడులు పెట్టబోతున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచారు తెలిపారు. ఏటా 80 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడతామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల బదులిచ్చారు. టెక్ దిగ్గజాల సమాధానాలకు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడులు చాలా పెద్ద మొత్తమనీ, వీటితో పెద్ద ఎత్తున ఉద్యోగలు సృష్టించొచ్చని వారిని అమెరికా అధ్యక్షుడు అభినందించారు.
మస్క్కు మళ్లీ షాకిచ్చిన ట్రంప్
ఈ విందుకు టెస్లా అధినేత, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్కు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశమైంది. అధ్యక్ష ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కొంతకాలం పాటు ట్రంప్ వెంటే నడిచిన మస్క్.. ఆ తర్వాత వీరి మధ్య విభేదాలు రావడంతో బహిరంగంగానే పరస్పర విమర్శలు చేసుకున్న విషయం విదితమే. ఇద్దరి మధ్య సంబంధాలు చెడిన కారణంగానే తాజాగా టెస్లా అధినేతను అధ్యక్షుడు ఆహ్వానించలేదనే చర్చలు నడుస్తున్నాయి. అయితే తనకు ఆహ్వానం అందిందనీ, తాను మాత్రం హాజరు కాలేకపోయానని మస్క్ చెప్పటం కొసమెరుపు. మస్క్కు నిజంగానే ఆహ్వానం అందిందా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉన్నది.
అమెరికాలో మీ పెట్టుబడులు ఎంత?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES