ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ సభ్యులే సూత్రధారులు, పాత్రధారులు
రంగంలోకి విజిలెన్స్ కమిషన్, విద్యా శాఖ
ఆడిట్లో బయటపడిన అక్రమాలు, అవకతవకలు
న్యూఢిల్లీ : కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి మూడు సంవత్సరాల కాలంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన అఖిల భారతీయ ఇతిహాస్ సంకలన్ యోజన (ఏబీఐఎస్వై)కు చెందిన పలువురు సభ్యులు న్యూఢిల్లీలోని భారతీయ చారిత్రక పరిశోధనా మండలి (ఐసీహెచ్ఆర్)లో కీలక పదవుల్లో నియమితులయ్యారు. భారతీయ చరిత్రను తిరగరాయాలన్న సంఫ్ు పరివార్ లక్ష్యంలో వీరు భాగస్వాములయ్యారు. ఆర్ఎస్ఎస్ ఢిల్లీ కార్యాలయంలోనే ఏబీఐఎస్వై కూడా ఉంది. ఈ సంస్థ సభ్యుల నేతృత్వంలో ఐసీహెచ్ఆర్లో సైద్ధాంతిక మార్పులు చోటుచేసుకున్నా యి. అయితే వీటితో పాటే అవినీతి, ఆర్థిక దుష్ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు కూడా వచ్చాయి. ఆరోపణల స్వభావం తీవ్రమైనది కావడంతో ప్రభుత్వం కూడా వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐసీహెచ్ఆర్లో అనుమా నాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏబీఐఎస్వైకి చెందిన నలుగురు సభ్యులపై మే ప్రారంభంలో కేంద్ర విజిలెన్స్ కమిషన్ అభియోగాలు మోపింది. వీరితో పాటు మరో 11 మంది ప్రస్తుత, మాజీ సభ్యులపై జరిమానాలు విధించేందుకు చర్యలు ప్రారంభించాలని విద్యా శాఖకు సూచించింది.
లోక్పాల్కు ఫిర్యాదులు
ఐసీహెచ్ఆర్లో ఆర్థిక వ్యవహారాలు, నియామకాలు, పదోన్నతులకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ 2022, 2023లో లోక్పాల్కు రెండు ఫిర్యాదులు అందాయి. దీంతో మండలిలో చోటుచేసుకుంటున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర విజిలెన్స్ కమిషన్తో పాటు విద్యా శాఖ కూడా సమాంతరంగా దర్యాప్తులు మొదలు పెట్టాయి. ఐసీహెచ్ఆర్ పుస్తకాలను ఆడిట్ చేయగా రూ.14.03 కోట్ల ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయి. మండలికి తమ పరిశోధనలు సమర్పించని పండితులకు కూడా రూ.7.4 కోట్ల గ్రాంట్లు అందజేశారు. సీనియర్ అధికారులు డబ్బును విచ్చలవిడిగా, నిర్లక్ష్యంగా ఖర్చు చేశారని తేలింది. సీనియర్ అధికారులు ఎడిట్ చేసిన ఓ పుస్తకం ప్రచురణకు రూ.30 లక్షలు ఖర్చు చేయాలని మండలి నిర్ణయించడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.
వీరి పైనే ఆరోపణలు
నిర్ణయాలు తీసుకోవడంలో పారదర్శకత పాటించలేదని, నియమ నిబంధనలను పెద్ద ఎత్తున ఉల్లంఘించారని ఆడిట్లో తేల్చారు. జరిమానాలు విధించాలంటూ విజిలెన్స్ కమిషన్ సూచించిన వారిలో ఐసీహెచ్ఆర్ డిప్యూటీ డైరెక్టర్ సౌరభ్ కుమార్ మిశ్రా కూడా ఉ న్నారు. ఈయన ఏబీఐఎస్వై అధిపతి బాల్ముకుంద్ పాండే మేనల్లుడు. విజిలెన్స్ కమిషన్ అభియోగాలు మోపిన మరో వ్యక్తి ఓం జీ ఉపాధ్యారు. ఈయన పరిశోధన, పరిపాలన విభాగపు డైరెక్టర్. ఐసీహెచ్ఆర్లో శక్తివంతమైన పదవి అయిన సభ్య కార్యదర్శిగా పనిచేశారు. ఉపాధ్యారు ఏబీఐఎస్వైలో సీనియర్ రచయితగా కూడా ఉన్నారు. ఆయన తరచూ టీవీ చర్చా వేదికలకు హాజరవుతూ ప్రభుత్వ వైఖరులను సమర్ధిస్తుంటారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం డిప్యూటీ రిజిస్ట్రార్ జగదీప్ సింగ్, నెహ్రూ స్మారక మ్యూజియం-గ్రంథాలయంలో పరిశోధన, ప్రచురణ విభాగం అధిపతి నరేంద్ర
శుక్లాపై కూడా చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. ఇక ఐసీహెచ్ఆర్ మాజీ సభ్య కార్యదర్శులు ఉమేష్ అశోక్ కదమ్, కుమార్ రత్నంలు పదవిలో ఉన్నప్పుడు జరిగిన అవకతవకలపై దర్యాప్తు జరిపించాలని కూడా కమిషన్ సూచించింది. కదమ్ ప్రస్తుతం జేఎన్యూలో అధ్యాపకుడు. ఈయన కూడా ఏబీఐఎస్వైలో సభ్యుడే. అయితే కేంద్ర విజిలెన్స్ కమిషన్ సిఫార్సులను విధిగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదు. ఒకవేళ విజిలెన్స్ కమిషన్ సిఫార్సులకు కేంద్రం అంగీకరిస్తే అప్పుడు వారిపై ఛార్జిషీట్లు దాఖలు చేస్తారు. కాగా ఇప్పటికే ఛార్జిషీట్లు దాఖలయ్యాయని ఐసీహెచ్ఆర్ ఛైర్మన్ రాఘవేంద్ర తన్వర్ తెలిపారు.
ఆడిట్లో ఏం తేలింది?
2021-22, 2022-23 మధ్యకాలంలో ఐసీహెచ్ఆర్లో రూ.14.03 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆడిట్లో తేలింది. ఉమేష్ అశోక్ కదమ్ హయాంలో అక్రమ నియామకాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా డబ్బు ఖర్చు చేశారని తేల్చారు. పరిశోధనా పత్రాలు సమర్పించని 397 మంది స్కాలర్లకు రూ.6.26 కోట్లు చెల్లించడం ఈ అక్రమాలలో అత్యంత ముఖ్యమైనది. ఐసీహెచ్ఆర్ నిబంధనల ప్రకారం వారి నుండి సొమ్మును రికవరీ చేయాల్సి ఉండగా ఆ పని చేయలేదు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు చెల్లించిన రూ.1.09 కోట్ల గ్రాంట్లను కూడా తిరిగి రాబట్టలేదు. నిబంధనలను తుంగలో తొక్కి ఐసీహెచ్ఆర్ భవనంలో రూ.2.55 కోట్ల విలువైన మరమ్మతు, పునరుద్ధరణ పనులు చేసినట్లు కూడా గుర్తించారు. పలువురు డైరెక్టర్లు, అధికారుల అక్రమాలు, ఆర్థిక అవకతవకలు కూడా తనిఖీలో బయటపడ్డాయి.
బంధువులు, స్నేహితులతో నింపేశారు
ఐసీహెచ్ఆర్ 1972లో ఏర్పడింది. ఇది ప్రభుత్వ నిధులతో నడుస్తోంది. చారిత్రక పరిశోధనలకు సంబంధించిన పుస్తకాలను ప్రచురించడం, అందుకు నిధులు అందించడం దీని పని. ఇది విద్యా శాఖ కింద పనిచేస్తుంది. 2017 నుండి ఏబీఐఎస్వైకి చెందిన పలువురు సభ్యులు మండలిలో నియమితులయ్యారు. మహాభారత కాలం నుండి ప్రస్తుత సమయం వరకూ చరిత్రను తిరిగి లిఖించాలని ఏబీఐఎస్వై కోరుతోంది. 2018లో ఏ మాత్రం అర్హతలు లేని ఏబీఐఎస్వై కార్యకర్తలను మండలిలో నియమించారు. ఆ తర్వాత వారి స్నేహితులు, బంధువుల కూడా అందులో చేరిపోయారు. 2022లో లోక్పాల్కు అందిన ఫిర్యాదులో ఐదుగురు అధికారులపై 14 ఆరోపణలు చేశారు. సంస్థలో తప్పుడు, చట్టవిరుద్ధ నియామకాలు జరిగాయని, సెమినార్ల నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘించారని, ఎలక్ట్రానిక్ గాడ్జెస్ కొనుగోలులో ఎలాంటి శ్రద్ధ కనబరచలేదని ఆ ఆరోపణల సారాంశం. ఆశ్రిత పక్షపాతం, రక్త సంబంధీకుల నియామకంపై ఫిర్యాదులు వచ్చాయి. 2023లో వచ్చిన ఫిర్యాదులో…మండలిని ఏబీఐఎస్వై భావజాలం నియంత్రిస్తోందని, కొందరు శక్తివంతులైన వ్యక్తుల సహకారంతో ఓ పథకం ప్రకారం ప్రభుత్వ సొమ్మును దోచుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
ఐసీహెచ్ఆర్లో భారీ కుంభకోణం
- Advertisement -
- Advertisement -