Tuesday, June 10, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమానవత బోటు స్వాధీనం

మానవత బోటు స్వాధీనం

- Advertisement -

గ్రెటా థన్‌బెర్గ్‌ సహా పలువురిని అదుపులోకి తీసుకున్న ఇజ్రాయిల్‌
ఐరాస ఆందోళన

జెరూసలేం : ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ నేతృత్వంలో గాజాకు మానవతా సాయం తీసుకెళ్తున్న బోటును ఇజ్రాయిల్‌ బలగాలు సోమవారం స్వాధీనం చేసుకున్నాయి. అందులో ప్రయాణిస్తున్న గ్రెటా, పాలస్తీనా సంతతికి చెందిన యురోపియన్‌ పార్లమెంట్‌లో ఫ్రెంచి సభ్యురాలు రిమా హసన్‌తోపాటు 12 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నాయి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత అత్యంత వినాశకర దాడులను చవిచూస్తున్న గాజాలో సాగుతున్న సైనిక ఆపరేషన్‌పై నిరసన తెలిపేందుకు వీరు అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. గాజా ప్రజలకు ఎంతగానో అవసరమైన ఆహారాన్ని తీసుకెళుతుండగా, ఇజ్రాయిల్‌ బలగాలు, బోటులోని కార్యకర్తలను కిడ్నాప్‌ చేశాయని ఈ యాత్రను నిర్వహించిన ఫ్రీడమ్‌ ఫ్లోటిల్లా కొయిలేషన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ”ఆ నౌకలోకి అక్రమంగా ఎక్కి లోపల వున్న నిరాయుధులైన పౌరులను కిడ్నాప్‌ చేశారని, ప్రాణాధారమైన సహాయాన్ని, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారని ఆ సంస్థ తెలిపింది. ఆ నౌకలో బేబీ ఫార్ములా, ఆహారం, వైద్య సరఫరాలు వున్నాయని పేర్కొంది. గాజాకు దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ జలాల్లో ఆ నౌకను స్వాధీనం చేసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. నిర్బంధించిన నౌకలోని కార్యకర్తలకు ఖైదీ యూనిఫారాలు ఇవ్వాలని ఇజ్రాయిల్‌ ఆదేశించినట్లు తెలిసింది. ఖైదీలు కాని వారికి ఖైదీ యూనిఫారాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడం అత్యంత అసాధారణమైన చర్య అని మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇదొక పబ్లిక్‌ రిలేషన్స్‌ స్టంట్‌ అని, ఆ బోటును ఇజ్రాయిల్‌ ఓడరేవు అష్‌డాడ్‌కు తరలించామని ఇజ్రాయిల్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందులోని కార్యకర్తలందరినీ వారిదేశాలకు పంపిస్తామని, అందులోని సహాయాన్ని గాజాకు పంపిస్తామని తెలిపింది. వారం రోజుల క్రితం సిసిలీ నుండి బయలుదేరిన ఈ మాడ్‌లీన్‌ ఓడలోని కార్యకర్తల బృందానికి వాతావరణ మార్పులపై పోరుడుతున్న కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్‌ నాయకత్వం వహిస్తున్నారు. గతనెలలో సముద్ర మార్గాన గాజా చేరుకోవడానికి ఫ్రీడమ్‌ ఫ్లోటిల్లా విఫలయత్నం చేసింది. మాల్టా సముద్ర తీర ప్రాంతంలో అంతర్జాతీయ జలాల్లో వుండగా రెండో డ్రోన్లతో దాడులు చేశారు.
తక్షణమే ఆహార ఆంక్షలు ఎత్తివేయాలి : ఐరాస
దుర్భిక్షం అంచున వున్న గాజాకు అత్యవసర ఆహార సరఫరాలను తీసుకెళుతున్న నౌకను ఇజ్రాయిల్‌ సైన్యం అడ్డగించడంపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే ఈ ఆహార ఆంక్షలను ఎత్తివేయాల్సిన అవసరం వుందని ఐక్యరాజ్య సమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయ ప్రతినిధి (ఒసిహెచ్‌ఎ) ఓల్గా చెరెవ్కో వ్యాఖ్యానించారు. ప్రజల అవసరాలతో పోల్చుకుంటే అందుతున్న సాయం ఏమాత్రమూ సరిపోదని ఆమె మీడియాతో వ్యాఖ్యానించారు.
వారు ఖైదీలు కాదు
మాడ్‌లీన్‌ కార్యకర్తలు నిర్బంధితులు తప్ప ఖైదీలు కాదని మానవ హక్కుల న్యాయవాది సారా బషి వ్యాఖ్యానించారు. ఖైదీలు కాని వారికి ఖైదీ యూనిఫారాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడం అత్యంత అసాధారణమైన చర్య అని విమర్శించారు. గతంలో ఇజ్రాయిల్‌లోకి ఎవరైనా ప్రవేశిస్తే, వారికి ప్రవేశాన్ని నిరాకరిస్తే, వారిని వారి దుస్తుల్లోనే పంపివేసేవారని గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -