రాజస్తాన్పై ఘన విజయం
పుణె: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. సూపర్ లీగ్ దశ తొలి మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసిన హైదరాబాద్ తాజాగా రాజస్తాన్పై గెలుపొందింది. ఆదివారం పుణెలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో రాజస్తాన్పై ఘన విజయం సాధించింది. సివి మిలింద్(3/25), తనయ్ త్యాగరాజన్(3/38) విజృంభించటంతో తొలుత రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 178/9 పరుగులకే పరిమితమైంది. రాజస్తాన్ తరఫున మహిపాల్ లామ్రోర్(48) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. తన్మయ్ అగర్వాల్(41 బంతుల్లో 73, 8ఫోర్లు, 3సిక్స్లు) ధనాధన్ అర్ధసెంచరీకి తోడు రాహుల్ బుద్ది (55) రాణించడంతో లక్ష్యాన్ని హైదరాబాద్ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. టోర్నీలో సూపర్ ఫామ్లో తన్మయ్..రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రాజస్తాన్ బౌలర్లలో కమలేశ్, మానవ్కు రెండేసి వికెట్లు దక్కాయి. హైదరాబాద్ తర్వాతి మ్యాచ్లో హర్యానాతో తలపడనుంది.



