హైకోర్టు ఆదేశాలతో చర్యలు
నవతెలంగాణ-మియాపూర్
రంగారెడ్డి జిల్లా గచ్బిబౌలి సంధ్య కన్వెన్షన్లో హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా మరోసారి సోమవారం కూల్చివేతలు చేపట్టింది. హైడ్రా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే అవుట్లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధరరావు ఆక్రమణలపై పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం గత మంగళవారం సంధ్యా శ్రీధర్రావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని సీరియస్గా పరిగణించింది. మొత్తం 20 ఎకరాల పరిధిలో వేసిన లే అవుట్లో 162 వరకు ప్లాట్లుండగా.. అందులోని మెజార్టీ ప్లాట్లు తనవే అనే ఉద్దేశ్యంతో రహదారులు, పార్కులు ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది. హైడ్రా అందుకే ఆక్రమణలను తొలగించిందని పేర్కొంది. ఒకసారి లే అవుట్ వేస్తే.. అదే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
సంధ్యా శ్రీధర్రావు రహదారుల ఆక్రమణలను ఇటీవల హైడ్రా తొలగించిన విషయం తెలిసిందే. ఈ విషయమై సంధ్యా శ్రీధర్రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో భాగంగా జస్టిస్ విజయ్ సేన్రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బాధిత ప్లాట్ యజమానులు కూడా వారి గోడును హైకోర్టుకు విన్నవించుకున్నారు. లే అవుట్లో సరిహద్దులన్నీ చెరిపేసి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారని సంధ్యా శ్రీధర్రావుపై ఫిర్యాదు చేశారు. ఎక్కువ ప్లాట్లు కొని.. తమను భయపెట్టి మిగతావి కూడా సొంతం చేసుకోవాలని శ్రీధర్రావు ప్రయత్నించారని బాధితులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఎక్కువ ప్లాట్లు తనవే ఉన్నాయని.. లే అవుట్లోని రహదారులు, ఆ పక్కనే ఉన్న తమ ప్లాట్లు, పార్కులు సరిహద్దులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని హైకోర్టుకు తెలిపారు. ఇదేమని అడిగితే తమపై దాడి చేసేవారని బాధితులు వాపోయారు.
ఓ ప్లాట్ యజమానురాలిపై దాడి చేయడమే కాకుండా తప్పుడు కేసులు కూడా పెట్టారని సంధ్యా శ్రీధర్రావుపై బాధితులు ఫిర్యాదు చేశారు. ఇందుకు గాను సంధ్య శ్రీధర్రావుకు రూ.10 లక్షలు సుప్రీంకోర్టు ఫైన్ విధించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ ప్లాట్లు చూడటానికి కూడా వీలు లేకుండా చేశారని వాపోయారు. నేరుగా దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేసిన సమయంలో తాము హైడ్రాను ఆశ్రయించామని బాధితులు తెలిపారు. హైడ్రా అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి, రహదారుల ఆక్రమణలను నిర్ధారించాక చర్యలు తీసుకున్నారని చెప్పారు.
తమ ఇబ్బందులు కోర్టుకు విన్నవించుకోవడానికే.. తాము ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యామని చెప్పారు. బాధితుల ఫిర్యాదులన్నీ విన్నాక జస్టిస్ విజయ్ సేన్రెడ్డి ఇప్పటికే రహదారుల పునరుద్ధరణకు తాము హైడ్రాకు సూచించామని బాధితులకు తెలిపారు. అందులోని ప్లాట్ల యజమానులకు అండగా హైకోర్టు ఉంటుందని ధైర్యం చెప్పారు. లే అవుట్లోని రహదారులను, పార్కుల ను పునరుద్ధరించాలని హైడ్రాకు హైకోర్టు మరోసారి సూచించింది. ఫైనల్ హియరింగ్ కోసం ఈనెల 18వ తేదీకి కేసును వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా సోమవారం ఉదయమే కూల్చి వేతలు చేపట్టింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే అవుట్లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. అనుమతులు లేని షెడ్స్ను తొలగించింది.


