Wednesday, July 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబీజేపీ పిలిస్తే వెళ్తా: రాజాసింగ్

బీజేపీ పిలిస్తే వెళ్తా: రాజాసింగ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కమలం పార్టీ తన పార్టీ అని, అది తన ఇల్లుగా భావిస్తానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కొన్ని వారాల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనకు ఇతర ఏ పార్టీ నుంచి ఆహ్వానం రాలేదని, బీజేపీ పిలిస్తే వెళతానని స్పష్టం చేశారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రతి కార్యకర్త సంవత్సరాలుగా ఆశతో ఉన్నారని, కానీ ప్రతిసారి కొన్ని తప్పుల వల్ల పార్టీకి నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనతో సహా కొందరు నాయకుల వల్ల తప్పులు జరిగి ఉండవచ్చని, అందుకే పార్టీ అధికారంలోకి రాలేకపోయిందని అన్నారు. ఇలాంటి విషయాలను ఢిల్లీ పెద్దలకు చెప్పడానికి తాను రాజీనామా చేశానని స్పష్టం చేశారు.

నేడో రేపో తనను కేంద్ర పెద్దలు పిలిచి మాట్లాడనున్నారని, వారిని కలిసినప్పుడు తాను ఎందుకు రాజీనామా చేశానో వారికి చెబుతానని ఆయన అన్నారు. ఏదేమైనా బీజేపీ తన ఇల్లు అని, కేంద్రం పెద్దలు రమ్మంటే ఎప్పుడైనా వెళతానని (పార్టీలో తిరిగి చేరడం) రాజాసింగ్ తెలిపారు. తనను పార్టీ నుంచి ఎవరూ బయటకు పంపించలేదని, తానే వెళ్ళానని ఆయన చెప్పారు.

తాను తెలంగాణ శివసేన బాధ్యతలను తీసుకోనున్నట్లు వచ్చిన వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు. తాను శివసేన లేదా జనసేన లేదా టీడీపీలోకి వెళతారని సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరిగిందని, కానీ ఆ పార్టీలు బీజేపీతోనే కలిసి ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -