నవతెలంగాణ-హైదరాబాద్: ఐ బొమ్మ, బప్పం పేర్లతో వెబ్ సైట్లను ఏర్పాటు చేసి, 21 వేల సినిమాలను పైరసీ చేసిన ఇమ్మడి రవి అరెస్టు సంగతి విదితమే. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ రెస్టారెంట్ ఏర్పాటు చేసి వినియోగదారులకు షడ్రుచుల ఆహార పదార్థాలను విక్రయించాలని ఆలోచిస్తున్నట్లు, అలాగే ఒంటరిగా ఉన్న తన తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నట్లు రవి తన నిర్ణయాన్ని పోలీసులకు వెల్లడించాడు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల విచారణలో రవి ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ఇమ్మంది రవిపై హైదరాబాద్లో మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి.
బతుకు తెరువు కోసం రెస్టారెంటు పెడతా .. నాన్నను జాగ్రత్తగా చూసుకుంటా : రవి
తమకు చిక్కినప్పుడు సినిమా టికెట్ల రేట్లు, హీరోల రెమ్యూనరేషన్ల విషయాలు మాట్లాడి, తన పనిని సమర్థించుకున్నాడని, ప్రస్తుతం పైరసీ సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు రవి చెబుతున్నాడని అధికారులు తెలిపారు. బతుకు తెరువు కోసం హైదరాబాద్ లేదా తన స్వస్థలమైన విశాఖపట్నంలో రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు పోలీసులతో రవి తెలిపాడు. తన తప్పు తెలుసుకున్న రవి తన తండ్రి చిన అప్పారావు వద్దకూ వెళ్లాలని భావిస్తున్నట్టు పోలీసులతో చెప్పాడు. భార్య నుంచి దూరమైన నాటి నుంచి అతడు ఒంటరిగానే జీవిస్తున్నాడు. ప్రస్తుతం తాను ఇక్కడ, తండ్రి అక్కడ ఒంటరి జీవితం గడుపుతున్నామని విచారం వ్యక్తం చేస్తున్నాడు. తన తల్లి నుంచి దూరంగా అనారోగ్యంతో బతుకుతున్న తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటానని పోలీసులకు రవి చెప్పాడు.



