నవతెలంగాణ-హైదరాబాద్ : పెళ్లైన కొద్ది నెలలకే ఓ ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివాసం ఉంటున్న సీనియర్ ఐఏఎస్ చిన్నరాముడు కుమార్తె మాధురి సాహితీబాయి(27) ఆదివారం రాత్రి తన గదిలోని బాత్రూమ్లో ఉరివేసుకుంది. నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బుగ్గనపల్లి తండాకు చెందిన రాజేష్నాయుడిని 2025 మార్చిలో ఆమె ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. వివాహమైన మూడో నెల నుంచి భర్త తనను వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులకు ఆమె తెలియజేయగా, కుమార్తెను అక్కడి పోలీసుల సహకారంతో రెండు నెలల కిందట తాడేపల్లిలోని నివాసానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆమె పుట్టింటిలోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆదివారం బలవన్మరణానికి పాల్పడింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని మంగళగిరి ఎయిమ్స్కు తరలించారు. తల్లి లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నరాముడు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఉద్యోగం ఉందని మోసం చేసి మా కుమార్తెను రాజేష్నాయుడు మహానందిలో రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో మళ్లీ పెళ్లి చేస్తామని చెప్పి అతడితో మా కుమార్తెను పంపాం. ఈ క్రమంలో ఆమెను అదనపు కట్నం తెమ్మంటూ రాజేష్ వేధింపులకు గురి చేశాడు. నీకు తానే దిక్కు, చంపేస్తానని బెదిరించేవాడు. కనీసం మాకు ఫోన్ చేయాలన్నా భర్త అనుమతి తీసుకోవాల్సి వస్తోందని, ఇక్కడ ఉండలేనని కుమార్తె చెప్పడంతో రెండు నెలల కిందట ఇంటికి తీసుకొచ్చాం. వచ్చిన నాటి నుంచి తన భర్తది నిజమైన ప్రేమ కాదని, అందుకే తీసుకెళ్లేందుకు రావడం లేదని కుమార్తె బాధపడుతూ ఉండేది. మాకు ఇలా దూరమవుతుందని అనుకోలేదు’’ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.



