నవతెలంగాణ – హైదరాబాద్: ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ జట్టు భాగస్వామ్యంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. భారత్లో తమ జట్టు భద్రతపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ్యక్తం చేసిన ఆందోళనలపై ఐసీసీ సానుకూలంగా స్పందించింది. టోర్నీలో బంగ్లాదేశ్ ఎలాంటి అంతరాయం లేకుండా పాల్గొనేందుకు పూర్తి సహకారం అందిస్తామని ఐసీసీ హామీ ఇచ్చినట్లు బీసీబీ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది.
భారత్లో తమ జట్టుకు భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని, అందువల్ల తమ మ్యాచ్లను వేరే దేశానికి తరలించాలని బీసీబీ గతంలో ఐసీసీని కోరింది. ఈ విజ్ఞప్తిపై స్పందించిన ఐసీసీ, బంగ్లా బోర్డు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. భద్రతా ఏర్పాట్ల విషయంలో బీసీబీ ఇచ్చే సూచనలను స్వీకరించి, వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఐసీసీ తమకు అల్టిమేటం జారీ చేసినట్లు కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలను బీసీబీ తీవ్రంగా ఖండించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని కొట్టిపారేసింది. తమ జట్టు భద్రత, శ్రేయస్సుకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం కోసం ఐసీసీతో చర్చలు కొనసాగిస్తామని బీసీబీ పేర్కొంది.



