Friday, June 20, 2025
E-PAPER
Homeమానవిఅభి రుచే వ్యాపారమైతే..

అభి రుచే వ్యాపారమైతే..

- Advertisement -

కౌసల్య చౌదరి… వ్యాపారంలో దూసుకుపోతోంది. మార్వాడీ వంటలు తయారు చేస్తూ కుక్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. అంతేకాదు కంటెంట్‌ సృష్టికర్తగా సోషల్‌ మీడియాలోనూ తన హవా చాటుతోంది. రాజస్థానీ సుగంధ ద్రవ్యాలు, నూనెలను విక్రయించే బ్రాండ్‌ సిద్ధి వ్యవస్థాపకురాలిగా తనకంటూ సమాజంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పదహారు లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్‌లతో మహిళలను శక్తివంతం చేయాలనే లోతైన లక్ష్యంతో ఉన్న ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం నేటి మానవిలో…
కౌలస్య నలుగురు తోబుట్టువులలో పెద్దది. తల్లిదండ్రులకు మద్దతుగా చిన్న వయసులోనే వంట చేయడం ప్రారంభించింది. ఆమె తల్లి పొలంలో పనిచేస్తుండగా, తండ్రి ఉద్యోగం చేసేవారు. పాఠశాల నుండి వచ్చిన తర్వాత చెల్లెళ్లను చూసుకోవడం, ఇంటి బాధ్యతలను నిర్వహించడం కౌసల్య బాధ్యతగా మారింది. ఇక వంట చేయడం ఒక అవసరంగా మారింది. అది తర్వాత కాలంలో ఆమెకు ఒక అభిరుచిగా మారింది.
భారతదేశం అంతటా
రాజస్థాన్‌లోని భోపాల్‌గఢ్‌లోని కురి అనే చిన్న గ్రామానికి చెందిన కౌసల్య తన వంటకాలను పంచుకోవడానికి యూట్యూబ్‌ వీడియోలను తయారు చేయడం ప్రారంభించింది. ఒక కడాయి, ఫోన్‌ కెమెరా, కార్డ్‌బోర్డ్‌ బాక్స్‌, అల్యూమినియం వైర్‌తో తయారు చేసిన స్టాండ్‌తో తన పని మొదలుపెట్టింది. ఆమె అభిరుచి పూర్తి స్థాయి వ్యాపార సామ్రాజ్యంగా మారుతుందని ఆమె ఏమాత్రం ఊహించలేదు. కౌసల్య అతి కొద్దికాలంలోనే ‘సిద్ధి మార్వాడీ’ని స్థాపించింది. దుకాణాలు, మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా భారతదేశం అంతటా సాంప్రదాయ మార్వాడీ సుగంధ ద్రవ్యాలు నూనెలను విక్రయించే స్వదేశీ బ్రాండ్‌గా నేడు అవతరించింది.
యూట్యూబ్‌ ఛానల్‌
కౌసల్య 2017లో తన యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది. అయితే హిందీలో తన వంటకాలను పంచుకునేటప్పుడు ప్రజాదరణ పొందలేకపోయింది. త్వరలోనే ఆమె తన ప్రాంతీయ భాష మార్వాడికి, స్థానిక రాజస్థానీ మాండలికానికి మారింది. ఈ మార్పు వీక్షకుల సంఖ్య పెరగడానికి దారితీసింది. దాంతో సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఒక నెలలోనే లక్ష దాటింది. ప్రస్తుతం యూట్యూబ్‌ ఛానల్‌లో పదహారు లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కౌసల్య తన విజయానికి సాంస్కృతిక ప్రాతినిధ్యం, ప్రామాణికత కారణమని అంటుంది. ‘ఇంత పెద్ద ప్లాట్‌ఫామ్‌లో నా భాష, ఆహారాన్ని ప్రజలు ఆదరించడం నిజంగా ఆనందంగా అనిపించింది’ అని ఆమె అంటున్నారు. గట్టే కి సబ్జీ, దాల్‌ బాతి, చుర్మా, భార్వా మిర్చ్‌ వంటి ప్రసిద్ధ రాజస్థానీ వంటకాలను వీక్షకులు ఎక్కువగా చూస్తుంటారు.
ప్రారంభ సవాళ్లు
ఛానల్‌ను ప్రారంభించడం అనేక సవాళ్లతో కూడుకొని ఉంది. ‘మాకు ఇంటర్నెట్‌ సదుపాయం చాలా తక్కువ. ఒక వీడియోను అప్‌లోడ్‌ చేయడానికి దాదాపు 5-6 గంటలు పట్టేది’ అని కౌశల్య చెప్పింది. ఆమెకు పరిమిత వనరులు, పరికరాలు మాత్రమే ఉన్నాయి. తన పొదుపు, కుటుంబ మద్దతుతో ఆమె రూ.7,000కు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఆమె భర్త నిరుద్యోగి. ఒక బిడ్డ కూడా ఉన్నాడు. కంటెంట్‌ సృష్టిని కొనసాగిస్తూనే ఇంటి ఖర్చులను నిర్వహించడానికి ఎంతో కృషి, సంకల్పం అవసరం. ‘నేను ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాను. కొత్తిమీర వంటి ప్రాథమిక వస్తువులను పొందడానికి నేను ప్రధాన నగరానికి వెళ్ళవలసి వచ్చేది’ అని ఆమె చెప్పింది.
మహిళా కేంద్రీకృత మోడల్‌తో
మార్చి 8, 2024న ఆమె తన బ్రాండ్‌ సిద్ధి మార్వాడిని ప్రారంభించింది. ఇది సాంప్రదాయ మసాలా మిశ్రమాలు, కోల్డ్‌-ప్రెస్డ్‌ నూనెలను విక్రయిస్తుంది. కౌసల్య మొదట్లో మూడు రకాల మసాలా దినుసులు, నాలుగు రకాల నూనెలు, 15 ఇతర వంటగది నిత్యావసరాలను అమ్మడం మొదటుపెట్టింది. మొదటి బ్రాంచ్‌ ఆమె గ్రామంలో ఏర్పాటు చేసింది. దీనికోసం 30-35 మంది స్థానిక మహిళలను నియమించింది. అక్కడి నుండి బ్రాండ్‌ పెరిగింది. ఇప్పుడు భారతదేశం అంతటా 12 బ్రాంచ్‌లలో, ఒక యాప్‌, ప్రత్యేక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. బ్రాండ్‌కు గుర్తింపు వచ్చినప్పటికి కౌసల్య లక్ష్యం వేరే ఉంది. ఆమె ఒక భాగస్వామ్య నమూనాను ఏర్పాటు చేసింది. దీని ద్వారా మహిళలు కనీసం రూ. 25,000 పెట్టుబడితో వ్యాపారంలో చేరవచ్చు. డబ్బు సంపాదించాలనుకునే మహిళలకు ఇంటి నుండే పని చేసేలా అవకాశాలను సృష్టించడమే దీని ఉద్దేశ్యం. అయితే ఈ మోడల్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ‘మహిళలు తాము ఎదగగలరని, తమకంటూ ఏదైనా చేయగలరని, వారి సొంత కథలు రాయగలరని నేను నమ్ముతున్నాను’ అమె అంటుంది.
ముందుకు సాగడం
కౌసల్య ప్రయోగాలు చేయడం, విస్తరించడం కొనసాగిస్తోంది. అయితే ఆమె తన ప్రయాణాన్ని ప్రత్యేకంగా చేసిన ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. ‘నేను ఇంట్లో ఉపయోగించే ఉత్పత్తులను మాత్రమే అమ్ముతాను’ అని ఆమె చెప్పింది. డిజిటల్‌ ప్రదేశాలను నావిగేట్‌ చేసే గ్రామీణ మహిళగా ఆమె జీవించిన అనుభవంతో పాటు, ఆమె బ్రాండ్‌తో ఉన్న వ్యక్తిగత సంబంధం ఆమె విజయానికి ఒక ప్రామాణికతను ఇస్తుంది. కౌసల్య ప్రయాణం ఆమె చేరుకున్న చోటుకు మాత్రమే కాకుండా ఆమె భాష, సంస్కృతి, సమాజంలో ఆమె విజయాన్ని ఎలా పాతుకుపోయిందో కూడా చూపిస్తుంది. తరచుగా ట్రెండ్‌లను వెంబడించే ఇంటర్నెట్‌ ఆర్థిక వ్యవస్థలో, ఆమె తనకు తెలిసిన ఆహారాన్ని వండడం ద్వారా, తాను పెరిగిన భాషలో మాట్లాడటం ద్వారా, పని ప్రారంభించిన ప్రదేశానికి దగ్గరగా ఉండటం ద్వారా శాశ్వతమైనదాన్ని నిర్మించుకుంది. ‘నేను ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలని, నా వ్యాపారాన్ని మరిన్ని నగరాలకు విస్తరించాలని కోరుకుంటున్నాను’ అంటూ ఆమె తన మాటలు ముగించింది.
మాస్టర్‌చెఫ్‌ ఇండియా అనుభవం
2023లో కౌశల్య మాస్టర్‌చెఫ్‌ ఇండియా ఆడిషన్‌ల కోసం పిలుపు వచ్చింది. దీనిపై మొదట్లో ఆమెకు నమ్మకం లేదు. కానీ జోధ్‌పూర్‌లో ఆడిషన్‌ చేసిన తర్వాత ఢిల్లీ రౌండ్‌కు షార్ట్‌లిస్ట్‌ చేయబడింది. చివరికి ఆమె టాప్‌ 12 పోటీదారులలో చోటు సంపాదించింది. ‘నేను షోను చూసి ప్రేరణ పొందేదాన్ని. దానిలో భాగం కావడం నన్ను మరింత ఉత్సాహపరిచింది. ఇందులో ఎంపిక కావడం నా కలను నెరవేర్చుకోవడానికి నాకు మరింత ప్రేరణనిచ్చింది’ అంటూ ఆమె పంచుకుంది. ఈ సమయంలో ఆమెకు ఇంకా ఏదో చేయాలనే ఆలోచన వచ్చింది. పోటీదారులు, న్యాయనిర్ణేతలతో మాట్లాడుతున్నపుడు నాణ్యమైన, ఇంటి తరహా రుచుల కోసం ప్రజలు ఎంతగా ఆరాటపడుతున్నారో గమనించింది. ‘ఏ ఆహారంలోనైనా సుగంధ ద్రవ్యాలు, నూనెలు ప్రధాన పదార్థాలు. అందుకే నేను ఈ రెండు వస్తువుల వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను’ అని చెప్పింది.
అవగాహన అవసరం
డబ్బు సంపాదించడమే కాదు… నిర్వహణ గురించి కూడా మహిళలకు తెలిసుండాలంటున్నారు ఆర్థిక నిపుణులు. అప్పుడే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండచ్చంటున్నారు.
– పెళ్లయ్యాక అందరూ మహిళలు ఉద్యోగం చేయాలని లేదు. ఒక్కోసారి కుటుంబ బాధ్యతలు, ఇతర కారణాల రీత్యా వివాహం తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి గృహిణిగా ఉండాల్సి రావొచ్చు. ఇంట్లో ఉన్నా డబ్బు నిర్వహణపై దృష్టి పెట్టి ప్రతి రూపాయీ వృథా కాకుండా బడ్జెట్‌ వేసుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు. నెలనెలా ఇంటి అవసరాలు, ఖర్చులకు సంబంధించి భార్యాభర్తలిద్దరూ చర్చించుకొని కొంత బడ్జెట్‌ను నిర్దేశించుకోవాలి. అందులో అత్యవసరమైన వాటికే ఖర్చు పెట్టి మిగిలిన మొత్తాన్ని నిపుణుల సలహాతో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో ఉపయోగించుకోవచ్చు.
– అనుకోకుండా భర్తను కోల్పోవడం లేదంటే భర్త నుంచి విడిపోవడం… ఈరెండు సందర్భాల్లో సింగిల్‌ మదర్‌గానే మహిళలు తమ పిల్లల బాధ్యతలు నిర్వర్తించాల్సి వుంటుంది. ఇలాంటప్పుడు పిల్లల చదువు, పెండ్లి వంటి దీర్ఘకాలిక లక్ష్యాల పైనే ఎక్కువ దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు. అప్పటికే వీటికి సంబంధించిన పొదుపు, పెట్టుబడి పథకాల్లో డబ్బు జమ చేస్తుంటే వాటిని కొనసాగించడం… అలాగే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ వంటివి తీసుకోవడం అవరమంటున్నారు.
– సాధారణంగా చాలామంది విషయంలో రిటైర్మెంట్‌ వయసొచ్చే నాటికే పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇంటి రుణం వంటి పెద్ద లక్ష్యాలన్నీ తీరిపోయి ఉంటాయి. మిగిలిన సొమ్మును సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్‌ స్కీమ్‌, పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌, ఎఫ్‌డీ, మ్యూచువల్‌ ఫండ్స్‌… వంటి రిస్క్‌ తక్కువగా ఉండే వాటిలో నిపుణుల సలహాతో పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా పొదుపు చేసిన డబ్బును మీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -