నవతెలంగాణ – హైదరాబాద్: జీవో నెంబర్ 49ని తిరిగి తీసుకువస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా జిన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అటవీ శాఖ అధికారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
కవ్వాల్ టైగర్ జోన్లో రాకపోకలు నిలిపివేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తరిమి తరిమి కొడతామని అధికారులను హెచ్చరించారు. పోడు రైతులు, అటవీ బిడ్డలపై ఆంక్షలు పెడితే సహించేది లేదని అన్నారు. పద్ధతి మార్చుకోవాలని ఇప్పటికే పలుమార్లు అటవీ శాఖ అధికారులను హెచ్చరించామని ఆయన అన్నారు.
గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలకు రేషన్ కార్డులను ఇస్తోందని ఆయన అన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక విషయంలో ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు.