-మధ్యప్రదేశ్లో మహిళాజడ్జికి బెదిరింపు లేఖ
-హనుమాన్ ముఠా సభ్యుడి పేరుతో స్పీడ్ పోస్టు
భోపాల్: మహిళా న్యాయమూర్తికి బెదిరింపు లేఖ అందింది. బతికి ఉండాలంటే ఐదు బిలియన్లు (రూ.500 కోట్లు) ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. బందిపోటు నాయకుడు హనుమాన్ ముఠా సభ్యుడి పేరుతో అందిన స్పీడ్ పోస్ట్ కలకలం రేపింది. మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తియోంథార్లోని మొదటి సివిల్ జడ్జి మోహినీ భదోరియాకు ఒక స్పీడ్ పోస్ట్ అందింది.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నుంచి పంపిన అందులో బెదిరింపు లేఖ ఉన్నది. ‘నువ్వు బతికి ఉండాలను కుంటే ఐదు బిలియన్లు (రూ.500 కోట్లు) చెల్లించాలి. సెప్టెంబర్ 1న సాయంత్రం 7:45 గంటలకు ఉత్తరప్రదేశ్ లోని బద్గడ్ అడవిలో ఆ డబ్బు అందజేయాలి. దీనిని విస్మరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అని ఆ లేఖ ద్వారా హెచ్చరించారు. గతంలో మధ్య భారత్ను ఠారెత్తించిన చంబల్ బందిపోటు నాయకుడు ‘హనుమాన్ ముఠా’కు విధేయుడిగా పేర్కొన్న వ్యక్తి సంతకం ఉన్నది. కాగా, జడ్జికి అందిన ఈ బెదిరింపు లేఖ కోర్టులో కలకలం రేపింది. ఇది చూసి న్యాయమూర్తి మోహినీ భదోరియా షాకయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ వెంటనే స్పందించారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాకు చెందిన ఒక అనుమానితుడిని గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను పంపారు. అలాగే రేవాలోని కోర్టులు, న్యాయమూర్తుల భద్రతను కట్టుదిట్టం చేశారు.