నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. తన 500కి పైగా పాటలకు సంబంధించిన కాపీరైట్ వివాదాన్ని బాంబే హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఇళయరాజా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, న్యాయమూర్తులు జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం పిటిషన్ను తోసిపుచ్చింది.
” ఇళయరాజా స్వరపరిచిన 4,850 పాటలను సోని మ్యూజిక్ కంపెనీ కొనుగోలు చేసింది. మేం ఓ పాటను ఆ కంపెనీ నుంచి కొని, సినిమాలో వాడాం. ఇది కాపీరైట్ ఉల్లంఘన కాదు ” అని నటి వనితా విజయ్ కుమార్ మద్రాస్ హైకోర్టుకు చెప్పారు. అనుమతి లేకుండా తన పాటను సినిమాలో వాడారంటూ ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఇళయరాజా మద్రాసు హైకోర్టులో ఓ కేసు దాఖలు చేశారు. ఈ కేసులో సోని మ్యూజిక్ కంపెనీని కూడా మద్రాస్ హైకోర్టు ప్రతివాదిగా చేర్చింది.