– 1284 మందికి ల్యాబ్టెక్నీషియన్లుగా ఉద్యోగాలు
– ఫలితాల విడుదలలో మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసిబ్బంది ఖాళీలను భర్తీ చేస్తూ రోగులకు మెరుగైన సేవలందించేందుకు తమ ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్-2) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు, వారు సాధించిన మార్కుల వివరాలను బోర్డు వెబ్సైట్లో అధికారికంగా అప్లోడ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూ, డీహెచ్ రవీందర్కుమార్, డీఎమ్ఈ నరేందర్కుమార్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. గతేడాది చివర్లో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయగా 24,045 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారనీ, వారిలో 1284 ఆ పోస్టులకు ఎంపికయ్యారని తెలిపారు. ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది వేలకుపైగా పోస్టులను భర్తీ చేశామనీ, మరో 7 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్ వంటి ముఖ్యమైన పోస్టులతో పాటు, వైద్య సేవలు మెరుగుపర్చేందుకు అవసరమైన ఇతర అన్నిరకాల పోస్టులనూ భర్తీ చేస్తున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి డాక్టర్లు, సిబ్బంది లేక వెలవెలబోయిన ఆస్పత్రులు ఇప్పుడు కళకళలాడుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. డాక్టర్లు, సిబ్బంది రాకతో ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. వీలైనంత త్వరలో మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని ప్రకటించారు.
వైద్యసేవలను మెరుగుపరుస్తున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



