నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్లో అతిపెద్ద ‘జీతాల కుంభకోణం’ వెలుగుచూసింది. 50,000మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు చెల్లించలేదు. రాష్ట్ర ప్రభుత్వ టాస్క్ఫోర్స్లో సుమారు 9శాతంగా ఉన్న ఈ ఉద్యోగుల జీతాలను ఆరునెలలుగా చెల్లించబడలేదు. అయితే ఈ ఉద్యోగులు అధికారిక పత్రాల్లో ఉన్నారు. వారికి గుర్తింపు, పేరు, ఉద్యోగి కోడ్ ఉంది. కానీ ఆరునెలలుగా వారికి జీతాల చెల్లింపు ప్రాసెస్ జరగలేదు. ఒకవేళ ఈ ఉద్యోగులు జీతం లేని సెలవుల్లో ఉన్నారా లేదా వారిని సస్పెండ్ చేశారా లేదా వారు ‘గోస్ట్’ ఉద్యోగులా అని పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అన్ని డ్రాయింగ్ అండ్ చెల్లింపు అధికారులకు(డిడిఒలు) మే 23న కమిషనర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ (సిటిఎ) పంపిన లేఖలను మీడియా బహిరంగ పరిచింది. ఈ లేఖలోని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఐఎఫ్ఎంఐఎస్ కింద 2024 డిసెంబర్ నుండి జీతాలు తీసుకోని రెగ్యులర్ /నాన్ రెగ్యులర్ ఉద్యోగుల డేటానపు జత చేసింది. ఉద్యోగి కోడ్లు ఉన్నప్పటికీ ఐఎఫ్ఎంఐఎస్లో వారి ధృవీకరణ అసంపూర్తిగా ఉంది. ఎగ్జిట్ ప్రాసెస్ కూడా పూర్తి కాలేదు. ఈ లేఖ తర్వాత, 6,000 మందికి పైగా డిడిఒలు దర్యాప్తులో ఉన్నారు. 15 రోజుల్లో రూ.230 కోట్ల మోసం జరిగిందని వివరించాలని కోరారు. లేఖలో పేర్కొన్న టైమ్లైన్ షెడ్యూల్ నేటితో ముగిసింది. ప్రతి డిడిఒ నుండి అనధికారిక ఉద్యోగులు వారి కార్యాలయాల్లో పనిచేయడం లేదన్న సర్టిఫికెట్ కోరుతూ ట్రెజరీ మరియు అకౌంట్స్ విభాగం ఆదేశాలు జారీచేసింది. 40,000మంది రెగ్యులర్, పదివేల మందిన తాత్కాలిక ఉద్యోగుల జీతాలు ఇంకా తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఉద్యోగులకు కోడ్లు ఉన్నందున వారి జీతాలు ఎప్పుడైనా తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ కేసుపై విచారణ జరుగుతోంది. ఈ ఉద్యోగుల మొత్తం జీతం రూ.230 కోట్లు.
అయితే అంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు జీతాలు అందకపోవడం వల్ల నకిలీ ఉద్యోగి కోడ్లు కేటాయించి ఉండవచ్చని సూచిస్తోంది. ఇప్పటి వరకు ఫిర్యాదులు కూడా అందలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. డిడిఒ జారీ చేసిన సర్టిఫికేట్లు నకిలీ ఉద్యోగి కోడ్లు జనరేట్ అయ్యాయో లేదో వెల్లడిస్తాయని అన్నారు.
ఎవరు అక్రమాలకు పాల్పడ్డారు. జీతాలను బ్యాక్డేటెడ్ చేసి తనిఖీలు లేకుండా ఉపసంహరించుకోవచ్చా ప్రభుత్వానికి సమాచారం లేకుండానే రూ. 230 కోట్ల కుంభకోణానికి అవకాశం ఉందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అసలు 50,000 ఉద్యోగాలు ఉన్నాయా ఒకవేళ లేకపోతే 9శాతం సిబ్బంది లేకుండా ఆ విభాగాలు ఎలా పనిచేస్తున్నాయి అన్న ప్రశ్నలకు సమాధానమివ్వాల్సి వుంది.
ఈ అంశంపై మధ్యప్రదేశ్ ఆర్థికమంత్రి జగదీష్ దేవ్డా అస్పష్టంగా సమాధానమిచ్చారు. ఏ ప్రక్రియను అనుసరించినా..అది నిబంధనల ప్రకారం జరుగుతుంది అని అన్నారు.