నవతెలంగాణ-హైదరాబాద్ : వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగురోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు మూడు కిలోమీటర్లకు పైగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. వీరికి సుమారు 20 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అన్న ప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీ చేస్తున్నారు.
క్యూలైన్లలో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు టీటీడీ ఉన్నతాధికారులు, భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి తోపులాటలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. వసతి కోసం రద్దీ పెరిగింది. దీంతో గదులు అందుబాటులో లేని భక్తులు యాత్రికుల వసతి సముదాయాల్లో సేద తీరుతున్నారు. మరికొందరు తిరుమల వ్యాప్తంగా ఉన్న షెడ్లు, జర్మన్ షెడ్లలో ఉంటున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది.