వంట నూనెల దిగుమతి సుంకం తగ్గుదల ప్రభావం…
కేంద్రప్రభుత్వ చర్యతో నష్టాల్లో రాష్ట్ర రైతులు…
సుంకం తగ్గింపును ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు డిమాండ్…
నవతెలంగాణ – అశ్వారావుపేట : పంట అధిక దిగుబడి ఉంటే ఆ మోస్తరు ధరలు పెరిగి ఎంతో కొంత లాభదాయకంగా ఉంటుందని రైతు ఆశలు పెంచుకుంటాడు. కానీ అంగడి రైతుల ఆశలను అడియాశలకు గురిచేస్తుందని తెలంగాణ పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.పుల్లయ్య అన్నారు. ఫలసాయం ఏదైనా ఇదే తంతు. ఆరుగాలం కాయకష్టం చేసిన రైతుకు కంటి నిండా పంట కనపడ్డా జేబుల్లోకి చిల్లర రావడం లేదు. దీంతో ఏమి చేయాలో తెలియక మనోవేదనతో సతమతం అవడం రైతు వంతు అవుతోంది. గత ఏడాది గెలలు దిగుబడి తగ్గి, ధరలు సైతం రూ.13 వేలకు మించి లేకపోవడంతో రైతులు ధైర్యం కోల్పోయారు. గత ఏడాది కంటే ఈ ఏడాది గెలలు దిగుబడి పెరగడంతో పాటు ధరలు సైతం రూ.20 వేలకు పైగా ఉండటంతో రైతులు కాస్తా ఊపిరి పీల్చుకున్నారు. అయితే గడిచిన మూడు నెలలుగా ఆయిల్ ఫాం గెలలు దిగుబడి పెరిగినప్పటికీ ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. మే నెలలో గెలలకు చెల్లించాల్సిన ధరలను ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారులు ఆదివారం నిర్ణయించారు. టన్ను గెలలు ధర రూ.18,748 లుగా ప్రకటించారు. ఏప్రియల్ లో టన్ను గెలలు ధర రూ.20058 లు కాగా.. మే లో గెలల ధర రూ.18,748 లు కావడంతో టన్ను గెలలకు రూ.1310లను రైతులు నష్టపోతున్నారు. ఈ సంవత్సరం టన్ను గెలలకు ఇంత పెద్ద మొత్తంలో ధరలు తగ్గడంతో రైతులు విలవిల్లాడుతున్నారు.
గెలలు దిగుబడి పెరిగినందున ధర పెరగక పోయినా స్థిరంగా ఉన్న చాలు అనుకున్న రైతుకు కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు చర్య గుదిబండగా మారింది. గెలల ధర తగ్గడానికి కారణం అయింది. ఇప్పటికే ఫాం ఆయిల్ పంటకు సోకిన చీడపీడలు ఒక పక్క, వంద్యత్వ మొక్కలతో గెలలు రాక కొందరు రైతులు ఆందోళనకు గురౌతున్న క్రమంలో.. టన్ను గెలలు ధర వేయికి పైగా ధర తగ్గడంతో వేలి పుండుపై రోకటి పోటులా రైతులు విలవిల్లాడుతున్నారు. ఈ క్రమంలో వంట నూనెలు దిగుమతి సుంకం తగ్గిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన మంత్రి మోడీ పరిశీలించి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని రైతులకు అండగా నిలవాలని తెలంగాణ పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.పుల్లయ్య డిమాండ్ చేస్తున్నారు.