అమెరికా ఆంక్షలను సడలించిన ఏడాది తర్వాత ఇరాన్ నుంచి సేకరణ
న్యూఢిల్లీ: టెహ్రాన్ చమురు, శుద్ధి చేసిన ఇంధనాలపై అమెరికా తాత్కాలికంగా ఆంక్షలను ఎత్తివేసిన ఏడాది తర్వాత భారత్ ఇరాన్ నుంచి ధృవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్ఎస్జీ) మొదటి కార్గోను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఎల్ఎస్జీ వాణిజ్య సంస్థలు, మరో మూడు పారిశ్రామిక వర్గాలు వెల్లడించాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల ఒత్తిడి కారణంగా భారతదేశం ఇరాన్ నుంచి ఇంధన కొనుగోళ్లను విరమించుకుంది. ఎల్ఎస్ఈజీ డేటా ప్రకారం.. ఈ ట్యాంకర్ మొదట చైనాకు వెళ్లాల్సి ఉంది. ఇరాన్కు ఎల్పీజీని తీసుకువెళ్తున్న ఆంక్షలకు గురైన ‘అరోరా’ ట్యాంకర్ త్వరలో పశ్చిమ తీరంలోని మంగళూరు ఓడరేవుకు చేరుకుంటుందని ఈ వర్గాలు తెలిపాయి. ఇరాన్తో అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి ద్వారా ఇంధన రవాణాకు అంతరాయం కలగడంతో ఈ దక్షిణాసియా దేశం తీవ్రంగా దెబ్బతింది.
ఎల్పీజీ కార్గోను పంచుకోనున్న ముగ్గురు రిటైర్లు
ఇరాన్ ఎల్పీజీ కార్గోను ముగ్గురు ఇంధన రిటైలర్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీ) పంచుకోనున్నాయి. ఈ కార్గోను ఒక వ్యాపారి నుంచి కొనుగోలు చేశారని, చెల్లింపు రూపాయలలో జరుగుతుందని పారిశ్రామిక వర్గాలు తెలిపాయి. మరిన్ని ఇరాన్ ఎల్పీజీ కార్గోలను కొనుగోలు చేసేందుకు భారత్ అన్వేషిస్తోందని కూడా పేర్కొన్నాయి. అయితే ఇరాన్ నుంచి కార్గోల కొనుగోలు గురించి తమకు తెలియదని ఒక అధికారి తెలిపారు. ”ఇరాన్ నుంచి ఎలాంటి సరుకులు రవాణా కాలేదని, ఆ విషయం మాకు తెలియ రాలేదు,” అని కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
పశ్చిమాసియా నుంచే అధికశాతం ఎల్పీజీ దిగుమతి
ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఎల్పీజీ దిగుమతిదారు అయిన భారతదేశం, వంటగ్యాస్ కొరత నుంచి గృహాలను కాపాడటానికి ప్రభుత్వం పరిశ్రమలకు సరఫరాను తగ్గించడంతో, దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన గ్యాస్ సంక్షోభంతో పోరాడుతోంది. గతేడాది భారత్ 33.15 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్పీజీని, లేదా వంటగ్యాస్ను వినియోగించింది. ఇందులో దిగుమతులు సుమారు 60శాతం డిమాండ్ను తీర్చాయి. ఈ దిగుమతులలో దాదాపు 90శాతం పశ్చిమాసియా నుంచే వచ్చాయి. హార్ముజ్ జలసంధి వద్ద నిలిచిన ఎల్పీజీ భారత్కు క్రమంగా తరలివస్తోంది. ఇప్పటి వరకు శివాలిక్, నందా దేవి, పైన్ గ్యాస్, జగ్ వసంత్ అనే నాలుగు ఎల్పీజీ ట్యాంకర్లను తరలించింది. పర్షియన్ గల్ఫ్లో నిలిచిపోయిన తమ ఖాళీ నౌకలలోకి కూడా భారత్ ఎల్పీజీని లోడ్ చేస్తున్నట్టు ఆయిల్ కంపెనీలు తెలిపాయి.



