న్యూఢిల్లీ : వాణిజ్య చర్చల నిమిత్తం ఈ నెలాఖరులో అమెరికా ప్రతినిధులు న్యూఢిల్లీ రావాల్సి ఉండగా ఆ పర్యటన వాయిదా పడింది. ఎన్డీటీవీ ప్రాఫిట్ కథనం ప్రకారం… ఈ నెల 25-28 తేదీల మధ్య అమెరికా వాణిజ్య ప్రతినిధులు మన అధికారులతో చర్చలు జరపాల్సి ఉంది. అయితే ఈ పర్యటన వాయిదా పడింది. భారత్పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన యాభై శాతం ప్రతీకార సుంకాలు ఈ నెల 27వ తేదీ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. భారత ఎగుమతులపై పాతిక శాతం సుంకాలు విధించిన ట్రంప్…రష్యా నుంచి మన దేశం చమురును కొనుగోలు చేస్తోందన్న అక్కసుతో మరో పాతిక శాతం సుంకాలను జరిమానాగా వడ్డించిన విషయం తెలిసిందే. వాణిజ్య చర్చల్లో భాగస్వాములవుతున్న ఇరు దేశాల అధికారులు పరస్పరం సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ చర్చలకు సంబంధించిన కొత్త షెడ్యూలును ఇంకా ఖరారు చేయలేదు.