Thursday, October 16, 2025
E-PAPER
Homeజాతీయంభారత పాస్‌పోర్ట్‌ ర్యాంకు పతనం..!

భారత పాస్‌పోర్ట్‌ ర్యాంకు పతనం..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌- హైద‌రాబాద్‌: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో భారత్ ర్యాంకు పడిపోయింది. తాజాగా విడుదలైన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత్ 85వ స్థానంలో నిలిచింది. గతేడాది 80వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి ఐదు స్థానాలు దిగజారడం గమనార్హం. భారత పాస్‌పోర్ట్ హోల్డర్లు ప్రస్తుతం 57 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం ఉంది. గత ఏడాది ఈ సంఖ్య 62గా ఉండేది. ఈ జాబితా ప్రకారం, సింగపూర్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌గా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. సింగపూర్ పౌరులు 193 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఆ తర్వాత దక్షిణ కొరియా (190 దేశాలు) రెండో స్థానంలో, జపాన్ (189 దేశాలు) మూడో స్థానంలో నిలిచాయి. జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి ఐరోపా దేశాలు టాప్ 5లో చోటు దక్కించుకున్నాయి.

ఈసారి ర్యాంకింగ్స్‌లో అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చరిత్రలో తొలిసారిగా అమెరికా టాప్ 10 జాబితా నుంచి బయటకు వచ్చింది. ప్రస్తుతం మలేషియాతో కలిసి 12వ స్థానంలో ఉన్న అమెరికా పౌరులు 180 దేశాలకు మాత్రమే వీసా రహిత ప్రయాణం చేయగలరు. గతేడాది అమెరికా ఏడో స్థానంలో ఉండటం గమనార్హం. భారత్ పొరుగు దేశాల విషయానికొస్తే, పాకిస్థాన్ 103వ స్థానంలో, బంగ్లాదేశ్ 100, నేపాల్ 101, శ్రీలంక 98వ స్థానంలో ఉన్నాయి. భూటాన్ 92వ ర్యాంకుతో భారత్ కంటే వెనుకంజలో ఉంది. మారిటానియా కూడా భారత్‌తో పాటు 85వ స్థానాన్ని పంచుకుంది. భారతీయులు వీసా లేకుండా ప్రయాణించగల దేశాలలో ఇండోనేషియా, మాల్దీవులు, థాయ్‌లాండ్, శ్రీలంక, భూటాన్, కెన్యా వంటివి ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -