– వాటి విలువ రూ.8,500 కోట్లకు పైనే..!
– స్టీల్పై సుంకం రెట్టింపుతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం
– అమెరికాకు ఎక్స్పోర్టుకు సిద్ధంగా వున్న ఉత్పత్తులు
– అదనంగా 25 శాతం సుంకాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి
– దేశీయ పరిశ్రమకూ ఎదురుదెబ్బే : మార్కెట్ విశ్లేషకుల అంచనా
న్యూఢిల్లీ: అమెరికాకు రెండోసారి అధ్యక్షడైనప్పటి నుంచి ఎడాపెడా సుంకాల విధింపుతో వాణిజ్య యుద్ధం చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ తీరు ప్రపంచ దేశాలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నది. వాణిజ్యం పేరుతో ఏదైనా చేయగలననే తీరుతో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర చర్చ నడుస్తున్నది. చైనా వంటి దేశాలు మాత్రం అమెరికాకు దీటుగా బదులిస్తున్నాయి. ఇక మరికొన్ని దేశాలు మాత్రం అమెరికా చర్యలపై ఏమీ చేయలేకపోతున్నాయి. ఇందులో భారత్ కూడా మినహాయింపేమీ కాదన్నది విశ్లేషకుల మాట. తాజాగా, స్టీల్పై సుంకాలను రెట్టింపు చేయనున్నట్టు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన భారత్పై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నదని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఉక్కు, అల్యూమినియం, వాటి ఉత్పత్తులపై సుంకాలను రెట్టింపు (25 శాతం నుంచి 50 శాతానికి) చేయనున్నట్టు ట్రంప్ ప్రకటించిన విషయం విదితమే. ట్రంప్ ప్రకటించిన ఈ అధిక సుంకాలు ఈనెల 4 నుంచి అమల్లోకి వస్తాయి. దీని ప్రభావం భారత్పై తీవ్రంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ ప్రకటనతో ఏటా రూ.38,800 కోట్ల విలువైన భారత ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమవుతాయని అంటున్నారు. ఇది ఇప్పటికే అస్థిర అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులతో పోరాడుతోన్న దేశీయ పరిశ్రమలకు దెబ్బ అని వాణిజ్య విశ్లేషకులు చెప్తున్నారు. ఈనెల 4 నుంచి ఈ టారిఫ్లు అమల్లోకి రానున్నాయి. ఇంకా కొంత సమయం మాత్రమే ఉన్నది. ఈ సుంకాల ప్రభావం భారత్తో పాటు అమెరికన్ దిగుమతిదారులు, ప్రపంచ ఎగుమతిదారులపై తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. పరిశ్రమల అంచనా ప్రకారం.. రూ.8,553 కోట్లకు పైగా(1 బిలియన్ డాలర్లు) విలువైన వస్తువులు.. ప్రధానంగా భారత ఇంజినీరింగ్ రంగం నుంచి ఇప్పటికే అమెరికాకు వెళ్లే ఓడల్లో ఉన్నాయి. ఎలక్ట్రికల్ నుంచి ఆటోమోటివ్ భాగాల వరకు విస్తరించి ఉన్న ఈ వస్తువులు ఇప్పుడు అదనంగా 25 శాతం సుంకాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ”ఇంజినీరింగ్ ఎగుమతులకు అతిపెద్ద దెబ్బ తగులుతుంది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల నడుమ వ్యాపారం ఎలా జరుగుతుంది?” అని ఇంజినీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మెన్ పంకజ్ చద్దా అన్నారు. ట్రంప్ నిర్ణయంతో భారత ఎగుమతిదారులు, అమెరికన్ దిగుమతిదారులు.. ఇద్దరూ గణనీయమైన నష్టాలను చవిచూస్తారని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) డైరెక్టర్ జనరల్, సీఈఓ అజరు సహారు తెలిపారు. ట్రంప్ ప్రకటన ఎగుమతిదారులకు సవాళ్లను సృష్టిస్తున్నది. అధిక సుంకాలను భర్తీ చేయటం కోసం అమెరికన్ కొనుగోలుదారులు ఇప్పటికే కాస్ట్-షేరింగ్ ఏర్పాట్లకు అభ్యర్థిస్తున్నారని బెంగాల్కు చెందిన ప్రముఖ ఎగుమతిదారుడు తెలిపాడు. ”ఎగుమతి కోసం ఇప్పటికే సముద్రంలో ఉన్న వస్తువులను తిరిగి తీసుకురాలేరు, అలా అని అక్కడే వదిలేయలేరు. ఈ షిప్మెంట్లు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి” అని సహారు అన్నారు.
ఆగిన భారత ఓడలు
- Advertisement -
- Advertisement -