నవతెలంగాణ హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు సంక్షోభంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిర్పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల టికెట్ల సొమ్ము రీఫండ్లపై ఇండిగో కీలక ప్రకటన చేసింది. ప్రయాణికులకు సాధ్యమైనంత త్వరగా ఈ చెల్లింపులు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపింది.
ఇండిగో విమానల రద్దు సంక్షోభానికి సంబంధించి సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశమైనట్లు వెల్లడించింది. సమస్యకు కారణమైన అంశాలపై చర్చలు జరిపినట్టు తెలిపింది. సీఈవో, బోర్డు సభ్యులు కలిసి క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. సంక్షోభం నుంచి బయటపడటంతో పాటు ఇండిగో విమాన సర్వీసుల పునరుద్ధరణకు ఈ గ్రూప్ చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
ఇదే క్రమంలో సంక్షోభ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు అండగా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది. రద్దయిన విమానాలకు సంబంధించిన రీఫండ్లు, రీషెడ్యూలింగ్లపై మినహాయింపులు ఇచ్చేందుకు బోర్డు సభ్యులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని పేర్కొంది.



