Sunday, October 5, 2025
E-PAPER
Homeజాతీయంకేరళ పట్ల అన్యాయం..నిర్లక్ష్యం

కేరళ పట్ల అన్యాయం..నిర్లక్ష్యం

- Advertisement -

దీనికి కేంద్రం ముగింపు పలకాలి : సీఎం పినరయి విజయన్‌

తిరువనంతపురం : కేరళ పట్ల జరుగుతున్న అన్యాయం, నిర్లక్ష్యానికి కేంద్రం ముగింపు పలకాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు. వాయనాడ్‌లోని ముందక్కై- చూరల్‌మల విపత్తు బాధితులకు అవసరమైన సహాయం అందించాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు. ” గతేడాది జులై 30న మెప్పాడిలో విపత్తు సంభవించింది. మరుసటిరోజే ప్రధాని మోడీ విపత్తు ప్రదేశాన్ని సందర్శించారు. 10 రోజుల్లోనే కేంద్ర బృందం అక్కడికి విపత్తు అంచనా కోసం వచ్చింది. విపత్తు నష్టానికి సంబంధించి ప్రాథమిక అంచనా వేసిన తర్వాత.. కేరళ రూ.1,202.12 కోట్ల అత్యవసర సహాయం కోసం కేంద్రాన్ని కోరింది.

ఈ ఘటన జరిగి ఏడాది మీద రెండు నెలలు గడిచింది. అయినా ఇప్పటికీ కేంద్రం నుంచి కేరళకు అత్యవసర సహాయం మంజూరు కాలేదు. విపత్తు బాధితుల రుణాలు మాఫీ చేయాలని రాష్ట్రం కేంద్రాన్ని అభ్యర్థించినా ఇప్పటి వరకు వాటిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. పైగా విపత్తు బాధితులకు రుణ చెల్లింపుల్లో ఉపశమనం కలిగించే విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌ 13ని తొలగించారు” అని విజయన్‌ ప్రకటనలో వివరించారు.

ముందక్కై- చూరల్‌మల విపత్తు బాధితుల రుణ మాఫీని చట్టం అనుమతించదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేరళ హైకోర్టుకు లిఖితపూర్వకంగా తెలియజేసిందని విజయన్‌ పేర్కొన్నారు. ”ఈ విపత్తు జరిగిన వెంటనే కేరళ తన మొదటి మెమోరాండంను ఆగస్టు 17, 2024న కేంద్రానికి సమర్పించింది. దీనికి సంబంధించిన వివరణాత్మక నివేదికను కేంద్రానికి సమర్పించడం జరిగింది. అయితే ఈ రెండు సందర్భాల్లో విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌ 13 అమలులో ఉంది. కానీ ఈ ఏడాది మార్చి 29న విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌ 13ని తొలగిస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. విపత్తు బాధితులపట్ల కేంద్రం కనికరం చూపించలేదు. సహాయం అందించలేదు.

ఈ విపత్తును తీవ్ర విపత్తుగా ప్రకటించడానికి కేంద్రం ఐదు నెలల సమయం తీసుకుంది. దీంతో కేరళకు అంతర్జాతీయంగా సహాయం పొందే అవకాశాలూ తగ్గిపోయాయి. పునర్నిర్మాణం, పునరావాసం కోసం రూ. 2,221.03 కోట్లు అవసరం కాగా, కేంద్రం రూ. 260.56 కోట్లను మాత్రమే మంజూరు చేసింది. ఈ మొత్తం వాస్తవ అవసరాలలో ఎనిమిదో వంతు కూడా కాదు. కేరళ పట్ల కేంద్రం చూపిన నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి కేంద్రంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని.. బాధితుల హక్కులను పరిరక్షంచడంలో, వారికి అవసరమైన సహాయాన్ని అందించడంలో కేంద్రం ఇక ఆలస్యం వహించకూడదు” అని కేరళ సీఎం విజయన్‌ వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -