పర్యాటక భవన్లో బెలూన్ ఎగురవేత
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ ఫిలిం అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ఫిల్మ్ ఫెస్టివల్ (హెచ్ఐఎస్ఎఫ్) సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ను బుధవారం టూరిజం ప్లాజాలో టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి, ఫిలిం డెవెలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక కలసి సంయుక్తంగా ఆవిష్కరించారు. టూరిజం భవనంపై ప్రచార బెలూన్లను ఎగురవేశారు. ఏడువందలకు పైగా వివిధ దేశాల నుంచి సైతం వచ్చిన సినిమాల ప్రోమోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచ వేదికగా ఎదిగిందన్నారు. యూరప్, అమెరికా వంటి దేశాల నుంచి సినిమాలు వచ్చాయని చెప్పారు. భారతదేశంతో పాటు వివిధ దేశాల నుంచి 700 కి పైగా చిత్రాలు రావడం హర్షించదగిన విషయమన్నారు. ఫిలిం ఇండిస్టీలోకి వచ్చే యువతీ యువకులకు ఇదొక గొప్పవేదిక అవుతుందనని అభిప్రాయ పడ్డారు. అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్ ఖ్యాతిని పెంచేలా ఉంటుందని తెలిపారు.
ప్రియాంక మాట్లాడుతూ ఈ చిత్రోత్సవాన్ని నిర్వహించే దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ బృందాన్ని అభినందించారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి వారు చేసిన అవిశ్రాంత కృషిని ఆమె ప్రశంసించారు. హైదరాబాద్లో అడ్వాన్స్ టెక్నాలజీతో రూపొందించిన ప్రసాద్స్ ఐమాక్స్లో ఈ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రదర్శనకు అధికారికంగా ఎంపికైన 60 మంది చిత్రనిర్మాతలందరికీ ఆమె హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ అధినేత, అంకురం దర్శకుడు ఉమామహేశ్వర్రావు మాట్లాడుతూ మూడు రోజుల పాటు షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించి వదిలేయకుండా, తరువాత కూడా సినిమాలు పంపిన, చూసిన యువతతో ఒక అవగాహనా సదస్సు నిర్వహిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తద్వారా సినిమా పట్ల అవగాహన పెంచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ డైరెక్టర్ కిషోర్బాబు తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



