నివేదికలు అందేవరకూ ఫలితాలు ప్రకటించం : మహారాష్ట్ర ఎస్ఈసీ
ముంబయి : మహారాష్ట్రలో ఈ నెల 15న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే కొందరు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ఒత్తిడి కారణంగా నామినేషన్లను ఉపసంహరించు కున్నారా లేక ప్రలోభాలకు లోనై ఉపసంహరించుకున్నారా అన్నది పరిశీలిస్తామని, ఆ తర్వాతే ఫలితాలను ప్రకటిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేసింది. అలాంటి మున్సిపల్ వార్డుల్లో ఫలితాల ప్రకటన ఆలస్యమవుతుందని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం 16వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. అయితే నివేదికలు సమర్పించడానికి అధికారులకు గడువు ఏదీ విధించలేదని, 16వ తేదీ తర్వాత కూడా వాటిని పంపవచ్చునని ఎస్ఈసీ పేర్కొంది.
నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన శుక్రవారం పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరిం చుకున్నారు. దీంతో అనేక చోట్ల ఒకే అభ్యర్థి బరిలో మిగిలాడు. ఏకగ్రీవ ఎన్నికలపై అధికారిక లెక్కలు ఏవీ అందుబాటులో లేనప్పటికీ 60 మంది వరకూ పోటీ లేకుండా ఎన్నికయ్యారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా ఏకగ్రీవ ఎన్నికలపై శివసేన (యూబీటీ) నేత సంజరు రౌత్ ఎస్ఈసీపై, అధికార మహాయుతిపై మండిపడ్డారు. ఎన్నికల సంఘం బీజేపీకి సేవకురాలిగా మారిందని, రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎన్నికల అధికారులు కూడా బీజేపీకి సేవకులు అయ్యారని ఆరోపించారు. కాగా రాష్ట్రంలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన 893 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది.



