Wednesday, December 10, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుతెలంగాణకు పెట్టుబడుల జాతర

తెలంగాణకు పెట్టుబడుల జాతర

- Advertisement -

– మొత్తం రూ.5.75 లక్షల కోట్లు
– ఫుడ్‌ ప్రాసెసింగ్‌, డెటా సెంటర్లకు ఆసక్తి

– ఫార్మా, క్లీన్‌ ఎనర్జీ రంగాల్లో భారీ ప్రాజెక్టులు
– సీఎం రేవంత్‌రెడ్డితో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు
– ఇన్‌ఫ్రాకీ డీసీ పార్క్స్‌ రూ.70వేల కోట్ల పెట్టుబడులు

– రెండో రోజూ రూ.2.96 లక్షల కోట్లు మొత్తం రూ.5.39 లక్షల కోట్ల హామీలు
– ఫుడ్‌ ప్రాసెసింగ్‌, డెటా సెంటర్లకు ఆసక్తి
– ఫార్మా, క్లీన్‌ ఎనర్జీ రంగాల్లో భారీ ప్రాజెక్టులు
– సీఎం రేవంత్‌ రెడ్డితో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు


నవతెలంగాణ – బిజినెస్‌ బ్యూరో
రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2025లో మంగళవారం నాడు వివిధ కంపెనీల ప్రతినిధులు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో రెండో రోజూ జరిగిన సమ్మిట్‌లోనూ దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం మొత్తంగా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. రెండో రోజంతా పెట్టుబడుల జాతర కొనసాగింది. తొలి రోజు రూ.2.43 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే. రెండో రోజు రూ. 3.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల పెంపునకు వచ్చిన భారీ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడను న్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌, డేటా సెంటర్లు, ఔషధ రంగం, క్లీన్‌ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్‌ వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులతో పాటు ఉద్యోగాలు వెల్లడించాయి.
ఇన్‌ఫ్రాకీ డాటా సెంటర్‌ పార్క్స్‌ 150 ఎకరాల్లో 1 గిగావాట్‌ సామర్థ్యం గల భారీ డేటా పార్క్‌ అభివృద్ధి చేపట్టేందుకు రూ.70 వేల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చింది. జెసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ రూ.9 వేల కోట్ల పెట్టుబడులకు హామీ ఇచ్చింది. పెద్ద స్థాయి డేటా సెంటర్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపింది.. దీంతో సుమారు 2 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
ఏజీపీ గ్రూప్‌ మొత్తం రూ.6,750 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌ (బీఈ) టీకాలు, పరిశోధన అండ్‌ అభివృద్ధి, తయారీ సేవల విస్తరణలో భాగంగా రూ.3,500 కోట్ల కొత్త పెట్టుబడులను ప్రకటించింది. గత పెట్టుబడితో కలిపి మొత్తం రూ.4,000 కోట్లు అవుతుంది. దీంతో 3 వేలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయని అంచనా వేసింది.

ఫెర్టిస్‌ ఇండియా ప్రయివేటు లిమిటెడ్‌ రూ.2 వేల కోట్ల పెట్టుబడితో తెలంగాణలో అధునాతన ఆహారం, వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనుంది. దీంతో 800 పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయని ఆ సంస్థ ప్రభుత్వానికి తెలిపింది. స్థిర వ్యవసాయానికి అవసరమైన పోషకాలు, బయో ఉత్ప్రేరకాలు తయారీకి రూ.200 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించారు. వింటేజ్‌ కాఫీ అండ్‌ బెవరేజెస్‌ లిమిటెడ్‌ ఫ్రీజ్‌ అండ్‌ డ్రైడ్‌ కాఫీ ప్లాంట్‌ స్థాపనకు రూ.1,100 కోట్ల పెట్టుబడితో యూనిట్‌ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. దీని ద్వారా వెయ్యి మంది వరకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు తెలిపింది.

రిలయన్స్‌ కన్స్యూమర్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ రూ.1,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే యూనిట్‌ ద్వారా 1000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఎలక్ట్రానిక్‌ తయారీ సేవల విస్తరణలో కేన్స్‌ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్‌ రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదించింది. ఆర్సీ సీటీ ఎనర్జీ ఇండియా ప్రయివేటు లిమిటెడ్‌ మూడు విడతల్లో రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 1,600 కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. పర్వ్యూ గ్రూప్‌ 50 మెగావాట్ల సామర్థ్యం గల గ్లోబల్‌ కెపాసిటీ, ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా 3 వేల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది.

ఫార్మా కంపెనీల ఆసక్తి..
అరబిందో ఫార్మా రూ.2,000 కోట్లతో విస్తరణ చేపట్టి 3వేలకి పైగా ఉద్యోగాలు సృష్టించనున్నట్టు ఆ సంస్థ ప్రభుత్వానికి తెలిపింది. హెటెరో సంస్థ మందుల తయారీ యూనిట్ల విస్తరణకు రూ.1,800 కోట్ల పెట్టుబడి ప్రకటించింది. దీంతో 9 వేలకి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలకు అవకాశం ఉందని అంచనా వేసింది. గ్రాన్యూల్స్‌ ఇండియా రూ.1,200 కోట్ల పెట్టుబడితో 2,500-3000 మందికి ఉపాధి కల్పించనుంది. భారత్‌ బయోటెక్‌ రూ.1,000 కోట్ల పెట్టుబడితో పరిశోధన, అభివృద్ధి, తయారీ సేవల కోసం ఆధునిక కేంద్రం ఏర్పాటు చేస్తోంది. దీంతో 200లకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.

ఆహార, పానీయాల తయారీ విస్తరణలో కేజేఎస్‌ ఇండియా రూ.650 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. ఈ యూనిట్‌ ద్వారా 1,551 మందికి ఉపాధి లభించనుందని అంచనా. గోద్రెజ్‌ ఇండిస్టీస్‌ గ్రూప్‌ రాష్ట్రంలో పాల ఉత్పత్తి విస్తరణకు రూ.150 కోట్ల పెట్టుబడితో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్‌ ద్వారా 300 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఆక్వెలాన్‌ నెక్సస్‌ లిమిటెడ్‌ తెలంగాణలో క్లీన్‌ ఎనర్జీ ఆధారంగా 50 మెగావాట్ల నెట్‌ జీరో ఉద్గారాల డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తోంది.

పర్యాటకరంగంలో రూ.7,045 కోట్ల పెట్టుబడులు
పర్యాటక రంగంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించినట్టు అధికారులు వెల్లడించారు. ఫుడ్‌ లింక్‌ ఎఫ్‌అండ్‌బీ హోల్డింగ్స్‌ (ఇండియా) రూ.3,000 కోట్లు పెట్టుబడులతో ముందుకొచ్చింది. డ్రీమ్‌వాలీ గోల్ఫ్‌ అండ్‌ రిసార్ట్స్‌ రూ.1,000 కోట్లతో నిర్మించనున్నారు. సారస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.1,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అట్మాస్ఫియర్‌ కోర్‌ హోటల్స్‌ (మాల్దీవులు) రూ.800 కోట్లు, కేఈఐ గ్రూప్‌ (కామినేని గ్రూప్‌) రూ.200 కోట్లు, పోలిన్‌ గ్రూప్‌ (టర్కీ), మల్టీవర్స్‌ హోటల్స్‌ రూ.300 కోట్లు, ఫ్లుడ్రా ఇండియా (స్పెయిన్‌) రూ.300 కోట్లు, శ్రీహవిషా హాస్పిటాలిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.300 కోట్లు, రిధిరా గ్రూప్‌ రూ.120 కోట్లు, సలామ్‌ నమస్తే దోసా హట్‌ (ఆస్ట్రేలియా), విశాఖ రిక్రియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.25 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ యానిమేషన్‌ ఐఫా ఉత్సవం, ఏథెన్స్‌ ఈవెంట్ల భాగస్వామ్యం ద్వారా రాష్ట్రానికి రూ.550-600 కోట్ల ఆర్థిక లాభం చేకూరనుంది.
టీడబ్ల్యూఐ గ్రూప్‌ ప్రపంచంలోనే తొలి ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌ మోటార్‌బైక్‌ తయారీ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు. రూ.1,100 కోట్లు పెట్టుబడితో 500 మందికి ఉద్యోగాల కల్పన అవకాశాలు రానున్నాయి. మహీంద్రా అండ్‌ మహీంద్ర సంస్థ ..జహీరాబాద్‌ యూనిట్‌ విస్తరణకు వచ్చే నాలుగేండ్లలో రూ.500 కోట్లకు పైగా పెట్టుబడికి ముందుకొచ్చింది. ఇండియా ఎక్స్‌ ట్రీమ్‌ అడ్వెంచర్‌ 20 ఎకరాల్లో ఎక్స్‌ ట్రీమ్‌ స్పోర్ట్స్‌, అడ్వెంచర్‌, ఈ-స్పోర్ట్స్‌ అరేనా. మొత్తంగా రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టింది.

బయోవరం టిష్యు ఇంజినీరింగ్‌, రెజెనరేటివ్‌ మెడిసిన్‌, సెల్‌-జీన్‌ థెరపీకి ప్రత్యేక కేంద్రం రూ.250 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.కెనడియన్‌ ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ తమ తొలి భారతీయ జీసీపీని హైదరాబాద్‌లో స్థాపించనున్నట్లు ప్రకటించింది. జీఎంఆర్‌ స్పోర్ట్స్‌ ఫ్యూచర్‌ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా శాటిలైట్‌ స్పోర్ట్స్‌ సిటీ అభివృద్ధి చేయనున్నారు. అజరు దేవగన్‌ ఫిల్మ్‌ స్టూడియోలో స్టూడియోలు, వీఎఫ్‌ ఎక్స్‌, వర్క్‌ షాప్‌లు వంటి ఫిల్మ్‌ ఎకోసిస్టమ్‌ను పీపీపీ మోడల్‌లో అభివద్ధి చేయనున్నారు. దీంతో యువతకు ఉపాధి అవకావాలు పెరగనున్నాయి. బ్లాక్‌స్టోన్‌ ఆసియా డేటా సెంటర్లు, లాజిస్టిక్స్‌ పార్కులు, కమర్షియల్‌ స్పేస్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు.

ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్లు
ఫీఫా-ఏఐఎఫ్‌ఎఫ్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ టాలెంట్‌ అభివృద్ధికి ప్రపంచ స్థాయి అకాడమీ హైదరాబాద్‌లో స్థాపించనున్నారు. తెలంగాణను గ్లోబల్‌ హాకి హబ్‌ గా మార్చేందుకు హాకీ మహిళల వరల్డ్‌ కప్‌ క్వాలిఫైయర్‌ 2026ను 8 దేశాలు పాల్గొనే అంతర్జాతీయ పోటీని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. 18 దేశాలు పాల్గొనే ఏషియా రోయింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 2026 నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ చెస్‌ ఫెస్టివల్‌ 2026 ప్రపంచంలోనే అతిపెద్ద చెస్‌ ఉత్సవం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -