ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ నియామకం
‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’ మండలి ప్రతిపాదన
టెహ్రాన్ : ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ వారసుడిగా ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ (56) నియామకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కుమారుడే తదుపరి సుప్రీం లీడర్ అవుతారని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆయన పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 88 మంది మత గురువులతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’ మండలి ముజ్తబా ఖమేనీను సుప్రీం లీడర్గా ఎన్నుకున్నట్టు తెలిసింది. ఖమేనీ మరణం తర్వాత గత కొన్ని రోజులుగా రహస్యంగా జరిగిన చర్చల అనంతరం, ముజ్తబా ఖమేనీని అత్యున్నత నేతగా ఎన్నుకున్నట్టు సమాచారం.
అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నియామకంలో ఇరాన్ అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది. సైనిక నాయకత్వం నుంచి వచ్చిన ఒత్తిడి, ప్రస్తుత యుద్ధ వాతావరణంలో స్థిరమైన నాయకత్వం అవసరమనే కారణంతో ముజ్తబా వైపు మత పెద్దలు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. నూతన సుప్రీంను ఖమేనీ అంత్యక్రియలు జరిపేరోజునే అంతం చేస్తామని అమెరికా, ఇజ్రాయిల్ల నుంచి బెదిరింపు లీకులు వస్తున్నాయి. సుప్రీం లీడర్ ప్రమాణ స్వీకారం చేసే భవనాన్ని సైతం దాడుల్లో కూల్చివేశారు.



