Wednesday, June 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనీటిపారుదల శాఖసీఈ ధర్మపై వేటు

నీటిపారుదల శాఖసీఈ ధర్మపై వేటు

- Advertisement -

– అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు
– ఈఎన్సీ జనరల్‌కు అటాచ్‌
– జలసౌధలో గుబులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

అవినీతి హద్దులు దాటడంతో సర్కారు కన్నెర్రజేసింది. అధికారులపై తీవ్ర చర్యలకు పూనుకుంది. ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న రాష్ట్ర నీటిపారుదల శాఖ సంగారెడ్డి సీఈ కె ధర్మపై ప్రభుత్వం వేటు వేసింది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు హైదరాబాద్‌ ఇన్‌చార్జి సీఈగా కాసులకు ఆశపడి చెరువుల్లో అడ్డగోలు నిర్మాణాలకు అనుమతులిచ్చినందుకుగాను సంగారెడ్డి సీఈతోపాటు హైదరాబాద్‌ ఇన్‌చార్జి సీఈ(ఎఫ్‌ఏసీ) పోస్టునూ పీకేసింది. అంతేగాక సీఈ ధర్మను ఏకంగా నీటిపారుదల శాఖ రాష్ట్ర కార్యాలయంలోని ఇంజినీర్‌ ఇన్‌ ఛీఫ్‌(జనరల్‌) జి అనిల్‌కుమార్‌కు అటాచ్‌చేసింది. సీఈ ధర్మపై శాఖాపరమైన విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం ఆయనపై క్రిమినల్‌ చర్యలు తీసుకోనున్నారని జలసౌధలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఏకంగా ధర్మ నిర్వహిస్తున్న రెండు సీఈ పోస్టుల నుంచి తొలగించడంతో జలసౌధలో అధికారులు, ఇంజినీర్లల్లో గుబులు ప్రారంభమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణాల్లో
సర్వీసు నుంచి తొలగించబడిన మాజీ సీఈ నల్లా వెంకటేశ్వర్లు, సస్పెన్షన్‌కు గురైన మాజీ ఈఎన్సీ హరిరాంతోపాటు సీఈ ధర్మ కూడా కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. వర్కింగ్‌ ఏజెన్సీల (కాంట్రాక్టర్లు)తో సంప్రదింపులు, ప్లానింగ్‌, డిజైనింగ్‌, సాంకేతిక అంశాల విషయాల్లో సీఈ ధర్మ జోక్యం ఉందని సమాచారం. వీటన్నింటిపై సర్కారు ఇతమిద్దంగా నిర్ధారణకు రానప్పటికీ, శాఖాపరమైన విచారణ చేపట్టి ధర్మను పూర్తిస్థాయిలో సర్వీసు నుంచి తొలగించే పరిస్థితులు ఉన్నాయని జలసౌధలో ఇంజినీర్ల మధ్య మాటామంతి నడుస్తున్నది. హైదరాబాద్‌లో ఇన్‌చార్జి సీఈ(ఎఫ్‌ఏసీ)గా ఉంటూ చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు ధర్మ అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. పలు నిర్మాణాల్లో అనుమతులు ఇవ్వడానికి కోట్లల్లో డబ్బులు పిండుకున్నారనే ప్రచారం జరుగుతున్నది. నగర శివారుల్లోని బాచుపల్లిలోని ఒక మాల్‌ నిర్మాణానికి ఎన్‌వోసీ జారీ చేయడానికి రూ. 1.5 కోట్లను వసూలు చేసినట్టు ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పటికే నీటిపారుదల శాఖ సేకరించిందని తెలిసింది. ఈనేపథ్యంలో సీఈ ధర్మను ఈఎన్సీ జనరల్‌కు అటాచ్‌ చేస్తూ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌బొజ్జా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -