నవతెలంగాణ-హైదరాబాద్: రాజ్యసభ ప్రతిపక్షనాయకుడు మల్లిఖార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉభయసభల్లోనూ ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహిస్తుండడం, ప్రతిపక్షాల గొంతులను అణచివేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతకుముందు ఛైర్మన్ స్థానంలో ఉన్నవారు ప్రతిపక్షాలు ప్రశ్నలు అడగడం కూడా సమావేశాల్లో భాగమే అని భావించేవారన్నారు. కానీ ప్రస్తుతం సభల్లో మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా తమ ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్నారంటూ మండిపడ్డారు. హోంమంత్రి అమిత్షా సూచనల ప్రకారం సభలో నడుచుకుంటున్నారని.. అసలు సభను నడిపిస్తున్నది మీరా లేక అమిత్ షా నా? అని డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ను ఖర్గే ప్రశ్నించారు.
మరోవైపు సీఐఎస్ఎఫ్ సిబ్బందిని సభలోకి తీసుకువచ్చారని.. వారు ప్రతిపక్ష నేతలను తమ ప్రజాస్వామ్య హక్కులు వినియోగించుకోకుండా నిరోధిస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలు రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.