లెనిన్ అన్విత్
పేరుకు తగ్గట్టుగానే మేఘా అమెరికా గడ్డమీద ఘర్జించింది. ఇజ్రాయిల్ దుర్మార్గాన్ని, అందుకు సహాయపడుతున్న అమెరికా విద్యాలయాల పరిశోధనలను ప్రశ్నించింది. కేవలం మాటలతోనే కాదు, రూపంతో కూడా పాలస్తీనాకు సంఘీభావంగా నిలిచింది. పాలస్తీనా అంతటా కమ్ముకున్న కారుమబ్బులను చీలుస్తూ మేఘా ఎం. వేమూరి మాటలు తూటాల్లా తాకాల్సిన వారికి తాకాయి. ఇప్పుడు ఆ ధిక్కార స్వరం ప్రపంచమంతటా ప్రతి ధ్వనిస్తోంది. ఆమె స్వరాన్ని ఆందులోని నిజాన్ని కోట్లాది నెటిజన్లు వింటూ, తమ మిత్రులకు చేరవేస్తున్నారు. పాలస్తీనాలో కోల్పోతున్న పసిపిల్లల ప్రాణాలు చూసినప్పుడు మానవతవాదులు ఎంతగా ఘోషించారో, మేఘా గొంతు విన్నప్పుడు అంతగా పులకించారు. పాలస్తీనా కోసం తన వ్యక్తిగత భవిష్యత్తును ఫణంగా పెట్టిన నవ యవ్వన విజ్ఞాన వేత్త, వీరవనిత మేఘా ఎం. వేమూరి. ఆమె మూలాలు మన తెలుగు గడ్డపై వున్నందుకు గర్విద్దాం, ఆమె ధైర్యానికి జేజేలు పలుకుదాం.
‘మేము గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని మా జీవితంలో ముందుకు సాగడానికి సిద్ధమవుతుంటే, గాజా లో విశ్వవిద్యాలయాలు లేకుండా పోయాయి’ అని అమెరికా, పాలస్తీనా విద్యావ్యవస్థల ద్వంద్వ స్వభావాన్ని ఒక్క వాఖ్యంలో మేఘా ప్రపంచానికి చాటారు. క్రమంగా కోల్పోతున్న ప్రపంచ ఆధిపత్యాన్ని తిరిగి పొందడానికి అమెరికా అధ్యక్షుడు బరితెగిస్తూ విపరీత చర్యలు ప్రకటిస్తుంటే, అదే గడ్డపై నిలిచి అమెరికా విద్యాలయాల పరిశోధనలు ఇజ్రాయిల్ హింసోన్మాదానికి ఎలా సహకరిస్తున్నాయో బద్ధలు కొట్టినట్లు మాట్లాడడం చిన్న విషయం కాదు. 56 ఇంచుల ఛాతి వుందని చెప్పుకునే అతిపెద్ద పాలకులే ట్రంపు నోటికి ఎదురు మాట్లాడలేక మౌనంగా తలదాచుకుంటుంటే మదించిన గజాన్ని అంకుశంలా నియంత్రించడానికి మేఘా ప్రయత్నించింది. ఇది యువతలో పెరుగుతున్న సామ్రాజ్యవాద వ్యతిరేకత కు ఒక ప్రతిరూపం. తాను మాట్లాడేది ఏమిటో, ఆ తర్వాత ఏమి జరుగుతుందో, తన భవిష్యత్త్ ఎలాంటి ప్రమాదంలో పడుతుందో స్పష్టంగా తెలిసి మాట్లాడడం వెనుక ఆమెలో, ఆమెలాంటి అనేక మంది యువతలో, విద్యాలయాల్లో మెదలుతున్న ఆలోచనలకు ప్రతిబింబం. ప్రపంచానికి ప్రాజాస్వామ్యం, వాక్ స్వాతంత్య్రం అంటూ నీతులు చెప్పే అమెరికా వాటిని ఎలా కాలరాస్తోందో మేఘా, ఆమె కుటుంబంపైన విధించిన నిషేధ చర్యలు మరోసారి బట్టబయలు చేశాయి.
మేఘా ఏం మాట్లాడింది?
అమెరికాలో ప్రతిష్టాత్మకమైన మస్సాచ్ సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి)లో మే 29న గ్రాడ్యుయేషన్ వేడుక సందర్భంగా జరిగింది. ఈ విద్యాలయంలో సీటు రావడం, డిగ్రీ పూర్తి చేయడం ప్రపంచంలో చాలా కొద్దిమందికి దొరికే అరుదైన అవకాశం. మన తెలుగు సంతతికి చెందిన మేఘా కంప్యూటర్ సైన్స్, న్యూరోసైన్స్, లింగ్విస్టిక్స్ కోర్సులో డిగ్రీ పూర్తి చేసింది. ఆమె ఎంఐటిలో 2025 సంవత్సరానికి క్లాసు ప్రెసిడెంట్గా (మన యూనివర్సిటీల్లో ఛైర్మెన్ హోదా) వుంది. గ్రాడ్యుయేషన్ వేడుకల్లో క్లాసు ప్రెసిడెంట్గా మాట్లాడే అవకాశం ఆమెకు వచ్చింది. తన భావాలను వ్యక్తం చేయడానికి ఇది సరైన సందర్భంగా ఆమె భావించింది. ఇజ్రాయిల్ దురాక్రమణకు గురవుతున్న పాలస్తీనాకు మద్దతుగా సాంప్రదాయ ఎరుపురంగు కెఫియే కండువా ధరించి ‘మనం డిగ్రీలు పూర్తి చేసి భవిష్యత్త్లోకి అడుగిడుతున్న ఈ సమయంలో, గాజాలో విద్యాలయాలే లేకుండా పోయాయని’ అంది. ‘పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడికి మన దేశమే (అమెరికా) కాదు, మన కళాశాల కూడా అలాంటి దాడిని ప్రోత్సహించడానికి సహాయపడుతుండడం సిగ్గుగా వుంది’. ఎంఐటిలో చేస్తున్న కీలక పరిశోధనలు ఇజ్రాయిల్ దళాలకు సహయపడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ‘ఎంఐటి పరిశోధన సంబంధాలను కలిగివున్న ఏకైక విదేశీ సైన్యం ఇజ్రాయిల్’ అని చెప్పింది. యువత మేధో విజ్ఞానం పాలస్తీనా వినాశానికి సహాయపడడాన్ని ఆమె ప్రశ్నించింది. ‘పాలస్తీనాను భూమి నుండి తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని’ ఇజ్రాయిల్ దుర్మార్గాన్ని నిర్భీతిగా ప్రకటించింది. ‘ఉద్ధేశపూర్వకంగా కార్యక్రమ సమయాన్ని, నియమాలను మేఘా ఉల్లఘంచిందని’ ఎంఐటి యాజమాన్యం ఆమెను, ఆమె తల్లిదండ్రులను క్యాంపస్ నుండి బహిష్కరించారు. ఆ వెంటనే మన దేశంలో లాగే అక్కడ కూడా మత, జాతి ఉన్మాద ముష్కరులు మేఘా, ఆమె కుటుంబం పైన సోషల్ మీడియాలో వికృత ట్రోలింగ్ చేశారు. మరోవైపు ప్రపంచంలోని అనేక దేశాల యువత, విద్యార్థులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
చదువు- ఉద్యమం మేళవింపు మేఘన
మేఘా తెలివైన విద్యార్థిని. ప్రపంచ ప్రఖ్యాత ఎంఐటి విద్యార్థి నాయకురాలు. ఆమె తాత్కాలిక ఆవేశంతో మాట్లాడిన మాటలు కావు అవి. గత కొన్ని సంవత్సరాలుగా పాలస్తీనాలో జరుగుతున్న జాతి దురహంకారం గురించి తాను వింటున్న, చూస్తున్న ఘటనలకు మేధోవంతురాలి స్పందన అది. జార్జియాలోని అల్ఫారెట్టాలో పుట్టిపెరిగిన మేఘా ప్రాథమిక విద్య అక్కడే పూర్తి చేసింది. విద్యార్థి దశలోనే జోర్డాన్లోని హైస్కూల్ విద్యార్థుల కోసం న్యూరోసైన్స్ పాఠ్యాంశాల కరికులమ్ రూపొందించింది. 2021లో అమెరికాలో నేషనల్ మెరిట్ అవార్డు సాధించి ఎంఐటిలో స్థానం దక్కించుకుంది. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి క్లాసు ప్రెసిడెంట్గా ఎన్నికై చదువుతోపాటు సామాజికస్పృహలో ముందుంది. ప్రపంచాన్ని ముఖ్యంగా పాలస్తీనాలో జరుగుతున్న పరిణామాలను విజ్ఞతతో నిశితంగా పరిశీలించింది. భావాలను ధృఢపరుచుకుంది. సందర్భం వచ్చినప్పుడు స్పష్టంగా ప్రకటించింది. విద్యాలయాల్లో భిన్న దృక్పధాలు, ప్రశ్నించేతత్వం లేకుండా విజ్ఞానం వికసించదు. కళ్లెదురుగా జరుగుతున్న దుర్మార్గాలను, అన్యాయాలను, వాటి మూలాలను పరిశోధించడం, తమ అభిప్రాయాలను స్పష్టంగా ప్రకటించడం విద్యకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలని మేఘా గుర్తించింది, ఆచరించింది. ఆ మాత్రపు ప్రశ్నను కూడా ప్రపంచంలోని అనేక దేశాధినేతలు, వారి అనుయాయులు సహించలేకపోవడం నేటి వ్యవస్థలో వున్న అతిపెద్ద బలహీనత. కొద్ది నెలల క్రితం అమెరికాలోని ప్రిన్టన్ యూనివర్సిటీలో పాలస్తీనాకు సంఘీభావంగా ప్రదర్శనలో పాల్గొన్న 110 మంది విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో తమిళనాడుకు చెందిన అచింతన్ శివలింగన్ అనే అమ్మారు హసన్ సయ్యద్ అనే అబ్బాయి కూడా ఉన్నారు. సామ్రాజ్యవాదం ఇంతగా నిర్బంధాలకు పాల్పడుతుందంటే దానికి ప్రతిఘటన పెరుగుతుందని స్పష్టమవుతుంది.
మేఘాకు అండగా మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, కేంద్ర ప్రభుత్వంలో తమకున్న పలుకుబడిని ఉపయోగించి ఆమెపై విధించిన నిషేధాన్ని తొలగించేందుకు తోడ్పడాలి. మహిళల హక్కుల గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ ఈ ఘటనపై తక్షణం మాట్లాడుతారని ఆశిద్దాం. రాష్ట్రంలోని విద్యార్థులు, అభ్యుదయ, ప్రజాతంత్రవాదులు స్పందించి మేఘా ఎం వేమూరికి అండగా నిలుద్దాం.