నవతెలంగాణ – హైదరాబాద్: షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఆత్మీయ సమావేశం జరిగింది. చైనాలోని తియాన్జిన్ నగరంలో ప్రారంభమైన ఈ సదస్సులో ఇరువురు నేతలు ఎదురుపడినప్పుడు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కరచాలనం చేసుకున్న అనంతరం ఇద్దరూ ఆలింగనం చేసుకుని తమ స్నేహబంధాన్ని చాటుకున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ ఎస్సీఓ సదస్సుకు హాజరైన మోడీ, పుతిన్ కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. చిరునవ్వులు చిందిస్తూ ఇరువురూ జరిపిన సంభాషణ అక్కడున్న వారిని ఆకర్షించింది. అనంతరం ఇద్దరు నేతలు కలిసి చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారు. ముగ్గురు నేతలు కలిసి త్రైపాక్షిక అంశాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశానికి సంబంధించిన చిత్రాలను ప్రధాని మోడీ తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. “అధ్యక్షుడు పుతిన్ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. తియాన్జిన్లో చర్చలు కొనసాగుతున్నాయి” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. కాగా, మోడీ, పుతిన్ ఎంతో సన్నిహితంగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్న సమయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వారిని చూస్తూ నిలబడిపోవడం కెమెరాలకు చిక్కింది. ఈ దృశ్యం ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై ఆసక్తికరంగా మారింది.

