పేదల కాలనీల ఏర్పాటులో కీలకపాత్ర : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు
నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఆదిలాబాద్ జిల్లా ఐద్వా ప్రధాన కార్యదర్శి లంక జమున అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు బండారు రవికుమార్, ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆశాలత జమున మృతదేహంపై పూలమాలలు వేసి నివాళి అర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు రవికుమార్ మాట్లాడుతూ ఎర్రజెండా రాజ్యం స్థాపించడమే లంక జమునకు ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. పేదలకు ఇంటిస్థలాల కోసం భూపోరాటాలు నిర్వహించి పోలీసులు కేసులను సైతం ఎదుర్కొని రణదీవెనగర్, భగత్సింగ్నగర్, కుంరం భీం లాంటి కాలనీలు ఏర్పాటులో కీలక భూమిక పోషించారని తెలిపారు.
నేటితరం నాయకులు ఆమెను చూసి ప్రేరణ పొందాలని పిలుపునిచ్చారు. ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆశాలత మాట్లాడుతూ ఆపదలో ఉన్న ఆడబిడ్డలు తన దగ్గరికి వస్తే అమ్మలా ఆదరించి వారికి మనోధైర్యాన్ని కల్పించి అండగా నిలిచేదని తెలిపారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ సీపీఐ(ఎం) కార్యకర్తలు, ప్రజాసంఘాల కార్యకర్తలు అమ్మను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతిమయాత్రలో జమున కుమారుడు లంక కార్తీక్, కుమార్తె రాణి, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పూసం సచిన్, సీనియర్ నాయకులు లంక రాఘవులు, బండి దత్తాత్రి, నిర్మల్ జిల్లా కార్యదర్శి గౌతం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.



