కార్యదర్శి, కోశాధికారి పదవులకు
నామినేషన్ దాఖలు
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన్నె జీవన్ రెడ్డి నిలిచారు. కార్యదర్శి, కోశాధికారి పదవులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండగా.. ఈ రెండు పదవులకు జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి ఆశీస్సులతోనే జీవన్రెడ్డి ఎన్నికల్లో పోటీపడుతున్నట్టు హెచ్సీఏ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నామినేషన్లకు శుక్రవారంతో గడువు ముగియగా.. మొత్తం 17 నామినేషన్లు దాఖలు అయ్యాయి. గతంలో అధ్యక్షుడిగా పని చేసిన అనిల్ కుమార్, ఆఫీస్ బేరర్గా పని చేసిన చిట్టి శ్రీధర్లు సైతం బరిలో నిలిచారు. కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఆగం రావు, హరినారాయణ రావు, భాస్కర్, గెరార్డ్ కార్ నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు (సోమవారం) ముగిసిన తర్వాత కార్యదర్శి, కోశాధికారి పదవులకు అంతిమంగా ఎవరు బరిలో నిలుస్తారనే అంశం తేలనుంది. గత ఎన్నికల్లో సంయుక్త కార్యదర్శి పదవికి పోటీ చేసి ఒక్క ఓటు తేడాతో ఓడిన చిట్టి శ్రీధర్ ఈసారి కోశాధికారి పదవి రేసులో నిలిచాడు. 2023 అక్టోబర్లో ఎన్నికైన దేవరాజ్ (కార్యదర్శి), సిజె శ్రీనివాసరావు (కోశాధికారి) ఆఫీస్బేరర్లుగా తొమ్మిదేండ్లు పూర్తి కావటంతో పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో కార్యదర్శి, కోశాధికారి పదవులకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. శుక్రవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియగా, ఈ నెల 15న పోలింగ్ నిర్వహించనున్నారు. జస్టిస్ లావు నాగేశ్వర్ రావు గతంలో వేటు వేసిన 57 క్లబ్లు ఈ ఎన్నికల్లోనూ ఓటు హక్కు కోల్పోయాయి.
హెచ్సీఏ బరిలో జీవన్రెడ్డి
- Advertisement -
- Advertisement -



