నామినేషన్ల స్క్రూట్నీ పూర్తి
81 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం
నేడు విత్డ్రాకు చివరి రోజు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను ఈవీఎంల ద్వారానే నిర్వహించనున్నారు. ఎవరూ ఊహించని విధంగా మొత్తం 211 మంది 321 నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం నిర్వహించిన స్క్రూట్నీ ప్రక్రియలో 321 నామినేషన్లకుగాను 135 ఆమోదించిన అధికారులు, 186 తిరస్కరించారు. ఇక 211 అభ్యర్థుల్లో 81మందిని ఆమోదించి 130మందిని తిరస్కరించారు.చివరకు 81 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. ముందుగా బ్యాలెట్ ద్వారా ఎన్నికలను నిర్వహించాలని భావించినా చివరకు ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
ఉప ఎన్నికల పోలింగ్ కోసం ఆరు ఈవీఎంలు, మూడు కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థులకు సంబంధించిన వివరాలు ఉండటంతో ఒక వేళ 81 మంది అభ్యర్థులు పోటీలో ఉంటే 6 ఈవీఎంలను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. 24వ తేదీ(నేడు) వరకు అభ్యర్థులు తమ నామినేషన్లకు విత్డ్రా సమయం ఉండటంతో ఎవరు విత్డ్రా చేసుకుంటారోనన్న చర్చ జరుగుతోంది.
ఈవీఎంలకు ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వినియోగించబోయే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఏంల)కు గురువారం చాదరఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్లో ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వీ. కర్ణన్ ఆధ్వర్యంలో అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ పర్యవేక్షించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలకు మొదటి దశ పరీక్షలు నిర్వహించారు.



