Monday, June 9, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుజూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యేమాగంటి గోపీనాథ్‌ మృతి

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యేమాగంటి గోపీనాథ్‌ మృతి

- Advertisement -

– అధికారిక లాంఛనాలతో రాయదుర్గం మహాప్రస్థానంలో అంత్యక్రియలు
– పాడె మోసిన కేటీఆర్‌, హరీశ్‌రావు
– నివాళులు అర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-జూబ్లీహిల్స్‌

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు. ఆయన మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు, ఇతర ప్రముఖులు, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయదుర్గం మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో మాగంటి గోపినాథ్‌ అంత్యక్రియలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఇటీవల డయాలసిస్‌ కూడా చేయించుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు మాదాపూర్‌ కావూరిహిల్స్‌లోని తన నివాసంలో ఆయనకు గుండెపోటు రాగా, వెంటనే కుటుంబ సభ్యులు ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందించారు. ఐసీయూలోనే 48 గంటలపాటు అజ్జర్వేషన్‌లో ఉంచినట్టు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఇతర నేతలు మాగంటి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయనకు మెరుగైన వైద్యం అందుతుందని, ఆరోగ్యం నిలకడగానే ఉందని మీడియాకు వెల్లడించారు. కేటీఆర్‌ అర్ధాంతరంగా అమెరికా పర్యటన ముగించుకుని వచ్చి మాగంటిని పరామర్శించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మాగంటి గోపీనాథ్‌కు బెయ్రిన్‌ డెడ్‌ అయ్యి మృతిచెందినట్టు ఏఐజీ వైద్యులు ప్రకటించారు.
మహాప్రస్థానంలో అంత్యక్రియలు
మాగంటి అంత్యక్రియలు రాయదుర్గంలోని సినీ ప్రముఖుల మహాప్రస్థానంలో నిర్వహించారు. ఇంటి నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. ఈ యాత్రలో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు పాడె మోశారు. మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో మాగంటి అంత్యక్రియలు జరగ్గా.. ఆయన కుమారుడు మాగంటి మృతదేహానికి నిప్పుపెట్టారు.
మాగంటి రాజకీయ ప్రస్థానం
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ 1963లో హైదరాబాద్‌లోని నానాక్‌రాంగూడలో జన్మించారు. 1983లో ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీలో చేరారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ 2014లో టీడీపీ నుంచి జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అనంతరం అప్పటి టీఆర్‌ఎస్‌లో 2016లో చేరారు. 2018, 2023 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, జూబ్లీహిల్స్‌ ప్రజల మన్ననలు పొందారు.
సీఎం, మంత్రులు, మాజీ సీఎం, ప్రముఖుల నివాళి
ఎమ్మెల్యే మాగంటి మృతదేహాన్ని ఏఐజీ ఆస్పత్రి నుంచి మాదాపూర్‌లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి మాగంటి నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. మాగంటి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర్‌ రాజనర్సింహాతోపాటు ఇతర కాంగ్రెస్‌ నేతలు మాగంటి భౌతికకాయానికి నివాళి అర్పించారు. మాజీ సీఎం కేసీఆర్‌ మాగంటి నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళి అర్పించారు. మాగంటి మృతదేహన్ని చూసి కేసీఆర్‌ భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, భరోసానిచ్చారు. కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ దంపతులు మాగంటి ఇంటికి చేరుకుని నివాళి అర్పించారు. అలాగే.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్‌, ఇతర బీజేపీ నేతలు మాగంటి మృతదేహానికి నివాళి అర్పించారు. వీరితోపాటు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఇతర నేతలు మాగంటికి నివాళి అర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -