Friday, June 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెగిన 'జూరాల' 9వ గేట్‌ రోప్‌వే

తెగిన ‘జూరాల’ 9వ గేట్‌ రోప్‌వే

- Advertisement -

నీటిని విడదల చేసే క్రమంలో మొరాయించిన గేట్లు
నీటి మట్టం తక్కువ ఉన్నా మరమ్మతులు చేయకపోవడంపై విమర్శలు
గతంలోనూ ఇదే పరిస్థితి
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి/ధరూరు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టు వరద ప్రవాహం పెరిగి నిండుకుండలా మారింది. దిగువ శ్రీశైలంకు నీటిని వదులుతున్నారు. అయితే, గంటగంటకూ జూరాల రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరుగుతుండటంతో గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్దమవ్వగా.. 9వ గేటు రోప్‌వే ఒకసారిగా తెగింది. నీటిని వదలుతున్న క్రమంలో మరో రెండు గేట్లు సైతం బలహీనపడటంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు ఎగువన కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాలకు వరద ఉధృతి పెరుగుతోంది. కృష్ణా బేసిన్‌లో ఉన్న వాగుల్లో వరదతో నదీ ప్రవాహం పోటెత్తుతోంది. లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహం దాటడంతో వరద నియంత్రణ చర్యలు చేపట్టారు. 15 గేట్లు ఎత్తి శ్రీశైలంకు నీటిని వదలుతున్నారు. ప్రాజెక్టు గేట్లు పైకి లేపుతున్న సమయంలో 9,12,16,19వ గేట్లు మొరాయించాయి. ఈ నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రాజెక్టులో నీటి మట్టం తక్కువగా ఉన్న సమయంలో మరమ్మతులు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఘటనలు గతంలో జరిగినా పైపై మెరుగులు దిద్దేవారు. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభంలో రోప్‌లను సరిచూడటం, గ్రీసింగ్‌ చేయడం, గేట్‌ రోప్‌వే బలాన్ని పరీక్షించడం, అవసరమైతే మార్చడం వంటి పనులు చేయాల్సింది. గేట్లు పూర్తిగా పనిచేయకపోయినా.. అదుపు తప్పినా.. నీటి విడుదలలో సమస్య ఏర్పడుతుంది. దీంతో దిగువ సమీప ప్రాంతాలు జలమయం అవుతాయి. కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుం టాయి. గుఱ్ణంగడ్డతో పాటు పెబ్బేరు, బ్రిడ్జి రంగాపూర్‌ సోమశీల, మంచాలకట్ట తదితర గ్రామాలు నీటమునిగే అవకాశాలున్నాయి. గత ప్రభుత్వంలోనూ శాశ్వత చర్యలు తీసుకోలేదు. ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది.
జూరాలకు ముప్పేమీ లేదు జూబేర్‌, ఈఈ- జూరాల ప్రాజెక్టు
వరదలు వచ్చే సమయంలో ప్రతి ఏడాదీ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా చిన్నచిన్న మరమ్మతులు వచ్చాయి. ప్రాజెక్టుకు సంబంధించిన భద్రత విషయంలో ఎవరికి ఎలాంటి అపోహలూ ఉండరాదు. ఎన్ని క్యూసెక్కుల నీరు వచ్చినా తట్టుకునే శక్తి ప్రాజెక్టుకు ఉంది.
రైతులపె కక్షగట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం- మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు
రైతులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష కట్టిందని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండల పరిధిలోని రేవులపల్లి గ్రామంలో గురువారం జూరాల ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, దాంతో జూరాలకు వరద ఉధృతి పెరిగిందని అన్నారు. వరద పెరుగుతుందని తెలిసినా అధికారులు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారని విమర్శించారు. ఎండాకాలంలో ప్రాజెక్టు మరమ్మతులు నిర్వహించాల్సి ఉండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. నీరు నిల్వ లేకపోతే పంట పొలాలకు నీటిని వదలాల్సి వస్తే ఏం చేస్తారని, ప్రాజెక్టు మరమ్మతులు ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా మరమ్మతులు నిర్వహించి వచ్చే వరద నీటిని రిజర్వాయర్‌తోపాటు చెరువులు, కుంటలు నింపాలని కోరారు. ఈ పర్యటనలో మాజీ మంత్రి లక్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ గద్వాల్‌ ఇన్‌చార్జి బాసు హనుమంతు, రఘు రెడ్డి, వెంకటేష్‌ నాయుడు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -