Sunday, June 1, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుటీజీఐఐసీ మెడకు కంచ గచ్చిబౌలి భూ వివాదం

టీజీఐఐసీ మెడకు కంచ గచ్చిబౌలి భూ వివాదం

- Advertisement -

– అటవీ చట్టాలు ఉల్లంఘించారనే ఆరోపణలు
– వేలాది చెట్ల నరికివేతలో నిబంధనలు పాటించలేదు
– రాష్ట్ర అటవీ శాఖ అధికారులపైనా కేంద్రం ఆగ్రహం
– వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కారని అభియోగం
– కేంద్ర సాధికారిక కమిటీకి రేపు నివేదికను సమర్పించనున్న రాష్ట్ర ప్రభుత్వం
కంచ గచ్చిబౌలి భూముల వివాదం తెలంగాణ ఇండిస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ) మెడకు చుట్టుకునేలా ఉందని తెలుస్తోంది. సర్వే నెంబర్‌ 25లో 400 ఎకరాల భూముల్లోని వేలాది చెట్ల నరికివేతపై కేంద్ర అటవీశాఖ సీరియస్‌గా ఉందని సమాచారం. వాటర్‌, ల్యాండ్‌ అండ్‌ ట్రీస్‌ (వాల్టా), అటవీ సంరక్షణ చట్టం1980, వన్యప్రాణుల రక్షణ చట్టం 1972ను ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారిక కమిటీ ప్రాథమికంగా గుర్తించిందని తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఢిల్లీలో సమావేశం కానున్న కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం కంచ గచ్చిబౌలి భూములపై సమగ్ర నివేదిక అందించ నుంది. అనంతరం వెలువడే కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన కంచ గచ్చిబౌలిలోని సర్వేనెంబర్‌ 25లో గల 400 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూన్‌లో జీవో 54 ద్వారా టీజీఐఐసీకి అప్పగించింది. సదరు ప్రభుత్వ సంస్థ ఓ మధ్యవర్తి కంపెనీ ద్వారా భూములను తనఖా పెట్టి బాండ్ల ద్వారా రూ.10 వేల కోట్ల మొత్తాన్ని సేకరించింది. సంబంధిత స్థలంలో ఐటీ, ఇతర పరిశ్రమల కోసం భూమిని అమ్మడం లేదా కేటాయింపులు చేయాలని టీజీఐఐసీ నిర్ణయించింది. ఇందుకోసం భూమిని చదును చేసేందుకు అక్కడున్న చెట్లను తొలగిం చింది. ఈ క్రమంలో అటవీ, వాల్టా చట్టాలను ఉల్లంఘించిందనేది ఒక ఆరోపణ అయితే, ఈ భూములు హెచ్‌సీయూకి చెందినవని మరో ఆరోపణ. విషయం చిలికి చిలికి గాలివానగా మారి హైకోర్టు, సుప్రీంకోర్టులకు చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన కేంద్ర సాధికారిక కమిటీ ఇటీవల రాష్ట్రంలో పర్యటించి వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో జరగనున్న కమిటీ సమావేశం లో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదికను సమర్పించేందుకు కసరత్తు చేస్తు న్నది. ఇందుకు సంబంధించి సీఎస్‌ ఇటీవల ఉన్నతాధికారులతో సమావేశమై సాధికారిక కమిటీకి సమర్పించే నివేదికపై చర్చించారు.
టీజీఐఐసీ మెడకు….
టీజీఐఐసీకి కంచ గచ్చిబౌలి భూములను బదిలీ చేశామని చెప్పేందుకు 26 జూన్‌ 2024న జారీ చేసిన ఉత్తర్వులో రాష్ట్ర ప్రభుత్వం ఎలియనేషన్‌ అనే పదాన్ని వాడింది. అయితే హక్కులు ఈ సంస్థకు బదిలీ అయ్యాయా? అనే అంశం ఎటూ తేలడం లేదు. తెలంగాణ రెవెన్యూ చట్టంలో ఎలియనేషన్‌ అనే పదం లేదు. భూమి, పట్టాదార్‌ పాస్‌బుక్‌లు, తెలంగాణ హక్కుల చట్టం 2020లో కూడా ఈ పదం లేదు. అందువల్ల సాంకేతికంగా యాజమాన్యం మారలేదని భావిస్తున్నారు. యజమాని కాని సంస్థ ఎలా చెట్లను తొలగించిందనే ప్రశ్నకు సమాధానం లేదు. వాల్టా, జీవవైవిధ్య, అటవీ సంరక్షణ చట్టాలను టీజీఐఐసీ ఉల్లంఘించిందని ప్రాథమికంగా గుర్తించిన, సాధికారిక కమిటీ అదే విషయాన్ని కోర్టుకు నివేదించిందని సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ లక్షణాలున్న ప్రాంతంలో చెట్లు కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలి. వన్య ప్రాణులున్న చోట భూములు చదును చేయాలంటే నిపుణుల కమిటీ పర్యటించి అధ్యయనం చేయాలి. అటవీ భూమి కాదని నిర్దారించిన తర్వాతే ఆ భూమిలోని చెట్లను తొలగించాలి.
వాల్టా చట్టం ప్రకారం ఒక చెట్టును తొలగిస్తే రెండు నుంచి ఐదు చెట్లు నాటాలి. అందుకు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఇవేవిూ పాటించకుండానే భూమిని స్వాధీనం చేసుకుని చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిందని టీజీఐఐసీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం టీజీఐఐసీ మెడకు చుట్టుకునేలా ఉందని సమాచారం.
నిబంధనలు ఉల్లంఘించలేదు : రాష్ట్ర ప్రభుత్వం
కంచగచ్చిబౌలి భూముల విషయంలో నిబంధనలు ఉల్లంఘించలేదని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఇదే విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టులకు కూడా తెలిపింది. ”ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో అప్పటి ప్రభుత్వం ఈ భూమిని ఐఎంజీ అకాడమీకి అప్పగించింది. ఒప్పందం ప్రకారం ఐఎంజీ ఈ భూములను వినియోగించలేదు. దీంతో ఈ కేటాయింపును సర్కార్‌ రద్దు చేసింది.
తెలంగాణ రెవెన్యూ రికార్డుల్లో అటవీ భూమి అని ఎక్కడా లేదు. దీనికి ఆనుకొని ఉన్న హెచ్‌సీయూ భూముల్లో భారీ భవనాలు నిర్మించారు. నాలుగు హెలీప్యాడ్‌లున్నాయి. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో పాములు, నెమళ్లు, చెట్లు ఉన్నాయి. పిటిషనర్ల వాదనల ప్రకారం ఆయా ప్రాంతాలను కూడా అటవీ భూములుగా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ లెక్కన హైదరాబాద్‌ మహానగరంలో ఎక్కడా నిర్మాణాలు చేపట్టకూడదు” అని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కంచ గచ్చిబౌలి భూములు.. అటవీ భూములని ప్రభుత్వం సైతం ఎక్కడా నోటిఫై చేయలేదు. ఇది పూర్తిగా పరిశ్రమలు, ఇతర అవసరాలకు కేటాయించిన స్థలం మాత్రమేని రాష్ట్ర ప్రభుత్వ అంటోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -