– ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉద్రిక్తత.. అట్టుడికిన పెద్ద ధన్వాడ
– ఫ్యాక్టరీ నిర్మించొద్దంటూ పది గ్రామాల ప్రజల ఆందోళన
– కర్రలు పట్టుకొని హెచ్చరిక..
– కంపెనీ వాహనాలు ధ్వంసం
– లాఠీలు ఝళిపించిన పోలీసులు
– అక్రమ కేసుల బనాయింపు
నవతెలంగాణ- రాజోలి
జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండల పరిధిలోని పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా బుధవారం సుమారు పది గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఫ్యాక్టరీ నిర్మించొద్దంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కర్రలు పట్టుకుని భారీగా తరలివచ్చి.. వాహనాలను ధ్వంసం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఒప్పుకునేది లేదంటూ తెగేసి చెప్పారు. ఫ్యాక్టరీ నిర్వాహకులు నిర్మించిన కంటైనర్లను తగలబెట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 12 నెలలుగా ఆ ప్రాంతంలోని 10 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. గతంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు కొంతకాలం వివాదం సద్దుమణిగింది. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి గాయత్రి కంపెనీ యజమాన్యం మంగళవారం అర్ధరాత్రి కూలీలను తీసుకొచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. విషయం తెలుసుకున్న ప్రజలు బుధవారం పెద్దఎత్తున కర్రలు చేతబట్టుకుని అక్కడకు చేరుకున్నారు. పచ్చని పంట పొలాలపై విషం చిమ్మే ఫ్యాక్టరీలను నిర్మించడం సరికాదని, ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఒప్పుకోబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా పనులు మొదలు పెడితే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. అయినా రైతులు, మహిళలు పరిశ్రమ ఏర్పాటు చేసే ప్రాంతానికి వెళ్లి టెంట్లను తొలగించి సామగ్రిని ధ్వంసం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ధన్వాడ చుట్టుపక్కల ఉన్న పది గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణానది తీరంలో ఇలాంటి ఫ్యాక్టరీలు పర్యావరణానికి తీరని నష్టం అన్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జి చేశారు. పలువురిపై అక్రమ కేసులు బనాయించారు.
ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు పోరాడుతాం : కె.శ్యాం ప్రసాద్,పెద్ద ధన్వాడ
ఇథనాల్ ఫ్యాక్టరీని పచ్చని గ్రామాల మధ్య నిర్మించకుండా దూరంగా అడవి ప్రాంతంలో నిర్మించడం మంచిది. పెద్ద ధన్వాడలో ఫ్యాక్టరీ పెడితే.. గ్రామానికి ఆనుకొని పారుతున్న తుంగభద్ర నది కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. తుంగభద్ర నదిపై చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించి రైతుల జీవితాల్లో మట్టి కొట్టకండి.. ఫ్యాక్టరీని రద్దు చెయ్యకపోతే ప్రాణ త్యాగానికైనా వెనుకాడం.
ప్రజలను మోసం చేయొద్దు : ఏ.పరంజ్యోతి, కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షులు
ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం అండగా ఉంటుంది. ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలంటే ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఇంత పెద్ద పరిశ్రమ పెట్టడం సరికాదు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల వైపు ఆలోచించి ఫ్యాక్టరీని రద్దు చేసేలా మాట్లాడాలి.
చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : మొగులయ్య, జోగులమ్మ గద్వాల్ జిల్లా డీఎస్పీ
ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని పోరాటం చేయడం తప్పు కాదు.. కానీ ఫ్యాక్టరీ వర్కర్లను ఇబ్బంది పెట్టడం, ఫ్యాక్టరీ ఆస్తిని ధ్వంసం చేయడం సరికాదు. అధికారులతో చర్చించి సమస్యను పురస్కరించుకోవాలి. అలా కాదని ఎవరైనా అధికారులపైగానీ, వర్కర్లపైగానీ దాడి చేసి.. చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తే.. చట్టం కూడా తన పని తాను చేసుకుపోతుంది.