Sunday, August 3, 2025
E-PAPER
Homeజాతీయంకేరళ నన్స్‌కు బెయిల్‌

కేరళ నన్స్‌కు బెయిల్‌

- Advertisement -

ఐదు షరతులతో అనుమతి
సెల్‌లో 53 మంది ఖైదీల మధ్య నిర్బంధం : సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌
బిలాస్‌పూర్‌ :
కేరళ నన్స్‌కు బెయిల్‌ మంజూరైంది. మానవుల అక్రమ రవాణా, మతమార్పిడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇద్దరు కేరళ నన్స్‌ని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు బిలాస్‌పూర్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో లోకల్‌ కోర్టు నన్స్‌కు బెయిల్‌ మంజూరు చేసినట్టు వారి న్యాయ సలహాదారు శనివారం ధ్రువీకరించారు. నన్స్‌పై భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) లోని సెక్షన్‌ 143, ఒరిస్సా మత స్వేచ్ఛ చట్టం 1967లోని సెక్షన్‌ 3 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా, నన్స్‌ తరపున కోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది గోపకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘మానవ అక్రమ రవాణా ఆరోపణలపై బీఎన్‌ఎస్‌లోని 143 సెక్షన్‌ కింద వీరిపై కేసు నమోదైంది. అయితే ఈ సెక్షన్‌ ఈ కేసుకు వర్తించదని వాదించాం. దీంతో వారికి కొన్ని షరతులతో ఒక్కొక్కరికి రూ. 50,000 పూచీకత్తుపై బెయిల్‌ మంజూరైంది. వారు దేశాన్ని విడిచి వెళ్లకూడదు. ” అని ఆయన అన్నారు. అలాగే దర్యాప్తును ఏవిధంగానూ ప్రభావితం చేయకూడదని, దాదాపు ఐదు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు నన్స్‌కు మంజూరు చేసిందని ఎన్‌ఐఏ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది కూడా మీడియాకు వెల్లడించారు. కోర్టు ఉత్తర్వులు తమకు అందాయని ఈ కేసును క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామని ఎన్‌ఐఏ కౌన్సిల్‌ తెలిపింది.

సెల్‌లో 53 మందితో నన్స్‌ను నిర్బంధించారు : సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ సెంట్రల్‌ జైలులో ఉన్న నన్స్‌ పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని సీపీఐ(ఎం) నేత, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ జాన్‌ బ్రిట్టాస్‌ తెలిపారు. మళయాళీలైన నన్స్‌ అందరినీ ఒకే గదిలో 53 మంది ఖైదీలతో నిర్బంధించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్‌ఐఏ కోర్టు వారికి బెయిల్‌ మంజూరు చేస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. జైలులో ఉన్న నన్స్‌ను కలుసుకోవటానికి ఎంపీలు జాన్‌ బ్రిట్టాస్‌, జోస్‌ కె. మణి, పి. సంతోశ్‌ కుమార్‌లతో కూడిన బృందం శనివారం ఉదయం దుర్గ్‌ సెంట్రల్‌ జైలుకు వెళ్లారు. నన్స్‌ లేవనెత్తే సమస్యలను పరిష్కరించాలని జైలు సూపరింటెండెంట్‌ను తమ బృందం కోరిందని జోస్‌.కె మణి తెలిపారు. నన్స్‌ ఈ నిర్బంధాన్ని సహిస్తూ అసాధారణ ఓర్పును ప్రదర్శిస్తున్నారనీ, ఇది మౌన నిరసనలో భాగమని చెప్పారు. ఈ కేసుతో సంబంధమున్న ఒక గిరిజన యువకుడిని జైలు అధికారులు బెదిరించి ఆరోపణలు చేయించారని ఎంపీ సంతోశ్‌ కుమార్‌ చెప్పారు. నన్స్‌కు షరతులతో కూడిన బెయిల్‌ వచ్చాక..ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో నన్స్‌ అరెస్టులు అక్రమమంటూ ..నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -