Thursday, December 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకిర్బీ కార్మికుల బస్సుకు ప్రమాదం

కిర్బీ కార్మికుల బస్సుకు ప్రమాదం

- Advertisement -

32 మందికి స్వల్ప గాయాలు
క్షతగాత్రులను పరామర్శించిన సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన
మేమున్నామంటూ బాధిత కుటుంబాలకు భరోసా
ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి


నవతెలంగాణ-పటాన్‌చెరు
కార్మికులతో వెళ్తున్న ఓ బస్సు.. మంచు వల్ల దారి కమ్మేయడంతో ముందున్న ట్రాలీ లారీని ఢకొీట్టింది. దాంతో ఆ బస్సులోని 32మంది కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్నాపూర్‌ మున్సిపాల్టీ పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న కిర్భీ పరిశ్రమకు చెందిన కార్మికులు బుధవారం ఉదయం ఇంద్రేశం మున్సిపాలిటీలోని పీఎన్‌ఆర్‌ కాలనీ నుంచి మొదటి షిఫ్ట్‌కు కంపెనీ బస్సులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉదయం ఐదున్నర గంటల సమయంలో కర్దనూర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి పాశమైలారం వెళ్లే రోడ్డు మార్గంలో పొగమంచు కమ్మి వేయడంతో ముందు వెళ్తున్న ట్రాలీ లారీని బస్సు ఢకొీట్టింది. దాంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమయింది. అందులో ఉన్న 32 మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే పటాన్‌చెరులోని అమేదా హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు హుటాహుటిన హాస్పిటల్‌కి వెళ్లి చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించారు.

ప్రమాద వివరాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లతో, పరిశ్రమ యాజమాన్యం ప్రతినిధులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఇక్కడ అవసరమైన వైద్య సదుపాయాలు లేకపోతే ఇతర హాస్పిటల్‌కు తీసుకుపోయి మెరుగైన వైద్యం అందించాలన్నారు. కార్మికులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. అధైర్యపడొద్దని, సీఐటీయూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదం జరిగిందని తెలవగానే కిర్బీ యూనియన్‌ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రాజు, నాయకులు తలారి శ్రీనివాస్‌, నాగప్రసాద్‌.. కార్మికులను అంబులెన్స్‌లో హాస్పిటల్స్‌కు తీసుకువచ్చే ఏర్పాట్లు చేసి.. పూర్తిస్థాయిలో వైద్యం అందే విధంగా పర్యవేక్షణ చేశారు. ఐదు మంది కార్మికులను ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచగా, మిగతా కార్మికులకు వైద్యం అందించి ఎటువంటి ఇబ్బంది లేదని డాక్టర్లు డిశ్చార్జ్‌ చేశారు. చుక్క రాములుతోపాటు యాజమాన్యం ప్రతినిధులు ఫిల్బోస్‌, రాజమహేందర్‌, యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అతిమేల మాణిక్‌, సీఐటీయూ జిల్లా కోశాధికారి కె.రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు బి.నాగేశ్వరరావు, పి.పాండురంగారెడ్డి తదితరులు ఉన్నారు.

పరామర్శించిన ఎమ్మెల్యే గూడెం..
రోడ్డు ప్రమాదంలో గాయపడిన కిర్బీ పరిశ్రమ కార్మికులను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి.. ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో చర్చించి కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రస్తుతం గాయపడిన కార్మికులందరూ క్షేమంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే వెంట ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, నాయకులు అంతి రెడ్డి, శివారెడ్డి, బండి శంకర్‌ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -