నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పి.సాహిత్య రాష్ట్ర స్థాయికి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.మధుపాల్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని తిర్నన్పల్లి గ్రామంలో జరిగిన నెట్ బాల్ క్రీడ టోర్నమెంట్, సెలక్షన్ లో అత్యంత ప్రతిభ కనపరిచి అండర్-17 రాష్ట్ర స్థాయి నెట్ బాల్ క్రీడా పోటీలకు 9వ తరగతి విద్యార్థిని పి.సాహిత్య ఎంపికైనట్లు ఆయన తెలిపారు.ఈనెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నల్గొండలో జరిగే రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలో సాహిత్య పాల్గొంటుందన్నారు.
పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైన సాహిత్యను, తీర్చిదిద్దిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రమేష్ గౌడ్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. మధుపాల్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మెల్ల గంగాధర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయుల బృందం అభినందించారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో మంచి ప్రతిభను ప్రదర్శించి జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికవ్వడం ద్వారా పాఠశాలకు, గ్రామానికి, ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.



