Tuesday, June 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిజయవంతంగా ముగిసిన కేటీఆర్ యూకే పర్యటన

విజయవంతంగా ముగిసిన కేటీఆర్ యూకే పర్యటన

- Advertisement -


– బీఆర్ఎస్ హయాంలోని తెలంగాణ సక్సెస్ స్టోరిని ఇంగ్లాండ్ గడ్డపై అద్భుతంగా వివరించిన కేటీఆర్
– తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు-అధికారం కంటే మాతృభూమిపైనే తమకు మమకారం ఎక్కువ అని చాటిన కేటీఆర్
– లండన్ నుంచి అమెరికా డల్లాస్ కి పయనం
– తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాల్లో పాల్గొననున్న కేటీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు యూకే పర్యటన విజయవంతంగా ముగిసింది. ఇంగ్లాండ్ గడ్డపై తెలంగాణ విజయగాథను అద్భుతంగా వినిపించిన కేటీఆర్, అధికారం కంటే పుట్టిన గడ్డ మీదనే తనకు మమకారం ఉంటుందని ఈ పర్యటనలో సమున్నతంగా చాటారు. ఈ నెల 27న యూకేలో అడుగుపెట్టిన కేటీఆర్ కు స్వాగతం పలకడానికి తెలంగాణ ఎన్.ఆర్.ఐలు భారీగా తరలివచ్చారు. కేటీఆర్ మాస్కులు ధరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గుండె సంబంధిత ఆపరేషన్ తరువాత కోలుకుంటున్న బీఆర్ఎస్ ఎన్.ఆర్.ఐ నాయకుడు, ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ మాజీ ఛైర్మెన్ అనిల్ ఇంటికి ఏయిర్ పోర్ట్ నుంచే నేరుగా వెళ్లి కేటీఆర్ పరామర్శించారు.మలిదశ ఉద్యమంలో దశాబ్దకాలం కాలం పాటు ఇంగ్లాండ్ గడ్డపై తెలంగాణవాదాన్ని వినిపించిన అనిల్ ను ఆప్యాయంగా పలకరించి కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానన్న సందేశాన్ని కేటీఆర్ ఇచ్చారు.

28 తేదిన బీఆర్ఎస్ ఎన్.ఆర్.ఐ కార్యవర్గం, సీనియర్ నేతలతో లండన్ లో సమావేశమైన కేటీఆర్…పార్టీ చేపడుతున్న కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో నిర్వహించాల్సిన కార్యక్రమాల పైన చర్చించారు. మలిదశ ఉద్యమకాలంలో తెలంగాణ వాదానికి ప్రతీకగా నిలిచారని ఎన్.ఆర్.ఐ (యూకే)విభాగాన్ని ప్రశంసించారు. బీఆర్ఎస్ హయాంలో 9 ఏండ్ల పాటు జరిగిన తెలంగాణ అభివృద్దికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచారని మెచ్చుకున్నారు.ఇప్పుడు కాంగ్రెస్ అవినీతి, మోసాలను సోషల్ మీడియాలో బలంగా ఎత్తిచూపుతున్నారన్నారు.అక్కడి ఎన్.ఆర్.ఐ నేతలు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేటీఆర్, యూకేలో బీఆర్ఎస్ రజోత్సవ వేడుకలను నిర్వహించడానికి ఒప్పుకున్నారు.

అదే రోజు యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమైన కేటీఆర్, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి కోసమే తాము పాటు పడుతామన్నారు. కోట్లాది మంది దశాబ్దాల స్వప్నాన్ని నిజం చేసిన తమకు తెలంగాణపై ఉండే ప్రేమ, అభిమానం మరెవరికీ ఉండవని చాటి చెప్పారు.

ఇక 30 వ తారీఖున బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో ప్రధాన ఉపన్యాసం ఇచ్చిన కేటీఆర్,ఆర్థిక రంగాన్ని స్థిరమైన వృద్ధితో నడిపించడంలో ప్రపంచానికి తెలంగాణ ఎలా దిక్సూచీగా మారిందో అద్భుతంగా వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమ రంగాల్లో అనుసరించిన విప్లవాత్మక పంథాను సాధికారికంగా గణాంకాలతో సహా వివరించి, వివిధ రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు, పాలసీలపై తన అనుభవాలు, ఆలోచనలను పంచుకున్నారు. సంపదను సృష్టించి దాన్ని పేదలకు సమానంగా పంచడమే తెలంగాణను దేశంలో ప్రత్యేకంగా నిలిపిన విషయాన్ని హైలెట్ చేశారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని కోరిన కేటీఆర్, ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను ఫస్ట్ ఛాయిస్ గా ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సులో కేటీఆర్ చేసిన ప్రసంగం దేశవిదేశాల ప్రతినిధులను ఆకట్టుకుంది.

మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ సంస్థలకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సేవలను అందించే పీడీఎస్‌ఎల్ సంస్థ నాలెడ్జ్ సెంటర్ ను వార్విక్ యూనివర్సిటీ లో మే 31 నాడు కేటీఆర్ ప్రారంభించారు. దిగ్గజ కార్పోరేట్ సంస్థలకు తెలంగాణ బిడ్డలు సేవలు అందించడం మనందరికీీ గర్వకారణం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో పూణే,చెన్నై తరువాత హైదరాబాద్ ఎలా ఆటోమోటివ్ హబ్ గా మారిందో వివరించారు. పెట్టుబడులు వచ్చి తెలంగాణ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకాలని మనస్పూర్తిగా ఆకాంక్షించారు.

ఇవాళ తన యూకే పర్యటన ముగించుకొని అమెరికాలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు అమెరికాలోని డల్లాస్ కి కేటీఆర్ బయలుదేరారు. మూడు రోజుల యూకే పర్యటనలో అనేకమంది ఎన్నారైలు కేటీఆర్ ని కలిశారు. ఫోటోలు తీసుకున్నారు. పార్టీకి, కేటీఆర్ నాయకత్వానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రజల కోసం చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు.

యూకే పర్యటన సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విభాగం అద్భుతంగా పనిచేస్తుందని పార్టీ చేస్తున్న కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఇక తనకు వీడ్కోలు పలికేందుకు ఏయిర్ పోర్ట్ కు భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎన్నారైలకు కేటీఆర్ థాంక్స్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -